ఇంగ్లండ్తో జరిగిన టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ని భారత్ 2-2 తేడాతో సమం చేసుకుంది. ఈ సిరీస్లో 1, 3 టెస్ట్ మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. 2, 5 టెస్టుల్లో భారత్ నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రా అయింది. దీంతో సిరీస్ విజయాన్ని ఇరు జట్లు పంచుకున్నాయి. అయితే భారత అద్భుత ప్రదర్శనలో పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఐదు టెస్టులు ఆడిన అతను కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ.. జట్టుకు అండగా నిలిచాడు. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్లో సిరాజ్ వల్లే భారత్ మ్యాచ్ గెలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. (Kumara Dharmasena)
చివరి టెస్ట్ ఆఖరి రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం ఉంది. ఇంగ్లండ్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి సిరాజ్ బౌలింగ్ చేశాడు. ప్రసిద్ధ్ ఆరంభంలో కొన్ని పరుగులు సమర్పించుకున్నా.. సిరాజ్ మాత్రం వికెట్లు తీస్తూ వచ్చాడు. ఆఖర్లో ఇంగ్లండ్ విజయానికి 7 పరుగులు అవసరం ఉండగా.. గస్ అట్కిన్సన్ వికెట్ని పడగొట్టి భారత్కు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో సిరాజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అతన్ని పొగుడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డ్లో ఉన్న శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన (Kumara Dharmasena) కూడా సిరాజ్ బౌలింగ్ని ప్రశంసించక ఉండలేకపోరు.
అట్కిన్సన్ వికెట్ తీసిన బంతి గురించి ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ‘నేను అదృష్టవంతుణ్ని. ఆ అద్భుతమైన బంతిని నేను చక్కటి స్థానంలో ఉండి చూశాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ సిరీస్లో సిరాజ్ ఏకంగా 185.3 ఓవర్లు అంటే.. 1,113 బంతులు బౌలింగ్ చేశాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో 674 పాయింట్లతో తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ 15వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.