గోదావరిపై ప్రాజెక్టు కడితే బనకచర్ల వివాదం ఉండేదే కాదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గం, పాలకవీడు మండలం, జాన్ పహాడ్ గ్రామంలో కృష్ణా నది పై నిర్మిస్తున్న జవహర్ జానపాడు లిప్ట్ ఇరిగేషన్, బెట్టేతండా గ్రామంలో మూసీనదిపై నిర్మిస్తున్న బెట్టేతండా స్కీం పనులను ఎంఎల్సి శంకర్ నాయక్తో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కృష్ణ్ణా, గోదావరి జలాల పంపకంలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిందని, దానిని సరిచేసేందుకు తాము పోరాడుతున్నామని అన్నారు. గత పాలకులు పదేళ్ల నిర్లక్ష్యం చేయటంతో కృష్ణా నదిలో 811 టిఎంసిలలో ఆంధ్రకి 599 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలకు రాతపూర్వకంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక నదీ పరివాహక ప్రాంతం, ఆయకట్టు, జనాభాను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని పోరాడుతున్నామని అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి వద్ద 38,000 కోట్లతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే..పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం పేరుతో నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే 62,000 కోట్ల రూపాయలు మిగిలేవని, వాటితో ఎస్ఎల్ బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, భీమా, నెత్తంపాడు, కోయిలసాగర్, దేవాదుల, సీతారామసాగర్, గౌరెళ్లి లాంటి ప్రాజెక్టులు పూర్తయి, నేడు తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. ఇరిగేషన్ శాఖపై వారు చేసిన తప్పిదాల వల్ల నేడు తాము 16 వేల కోట్ల రూపాయలు వడ్డీ చెలిస్తున్నామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27,500 కోట్లు, సీతారామ ప్రాజెక్ట్కు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినా ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టులోకి తీసుకొని రాలేదని అన్నారు.
తమ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి తాను నీటిపారుదల శాఖలో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీరు ఇవ్వకున్నా తెలంగాణలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడించి దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని అన్నారు. జవహర్ జాన్పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధప్రాతిపదికన వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, ఇప్పటికే మూడుసార్లు సందర్శించినా పనులలో పురోగతి లేదని కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జాన్పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ స్కీంను రూ.302 కోట్ల తో నిర్మిస్తామని, దీని ద్వారా అలింగాపురం, రాఘవపురం, బొత్తలపాలెం, కోమటికుంట, మీగడం పాడు తండా, చెరువు తండా, హనుమాయగూడెం, పాలకవీడు, సజ్జాపురం, నాగిరెడ్డి గూడెం గ్రామాలలోని 10,000 ఎకరాలకు సాగునీరు, జానపాడు చెరువుకి నీరు అందిస్తామని తెలిపారు.
డిజైన్లో ఏమైనా మార్పులు ఉంటే సిడిఓ (సర్కులర్ డిజైన్ ఆపరేషన్) సిఈ ద్వారా చేసుకోవాలని కాంట్రాక్టర్కి సూచించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, పైప్లైన్ పనులు ఒకేసారి నిర్మించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొనిరావాలని సూచించారు. అనంతరం రూ. 33.83 కోట్లతో నిర్మించే బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బెట్టేతండా, సజ్జాపురం, పాడియా తండాల గిరిజన రైతులకు చెందిన 2,041 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. మూసీ నదిలో నీరు ఉండేలా రూ.10.50 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి నీరు అందించాలని కాంట్రాక్టర్కు, అధికారులకు ఆదేశించారు. జాన్పహాడ్, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే పాలకవీడు మండలం సస్యశ్యామలం, సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి నరసింహ, సిడిఓసిఈ , ఆర్డిఒ శ్రీనివాసులు, ఇరిగేషన్ సిఈ రమేష్ బాబు, ఎస్ఈ శివధర్మ తేజ, డిఈ నవికాంత్, హరి కిషోర్, ఏఈ సతీష్, కాంట్రాక్టర్ శ్రీనివాస్, హన్మంత్ రామ్, నాగరాజులతోపాటు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాలోతు మోతిలాల్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ వి సుబ్బారావు బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శేషురెడ్డి, నియమానాయక్, కొనతం చిన్న వెంకటరెడ్డి, నూకల సందీప్ రెడ్డి, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.