గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు,
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య చిన్నమైలు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపి లను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీ సిల్టేషన్ ఆధునిక పద్దతుల్లో పూర్తి చేసి పూర్వపు సామర్థ్యం తీసుకొని వస్తామని అన్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.