టిఒఆర్ మార్పులను కేంద్రం
తిరస్కరించాలి ట్రిబ్యునల్
నిబంధనలను ఉల్లంఘిస్తున్న
ఎపి ప్రభుత్వం ఎలాంటి
అనుమతులు లేకుండా
కృష్ణా,గోదావరిలపై ప్రాజెక్టుల
నిర్మాణం ఈ అక్రమ
ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోండి
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి
భూపేందర్యాదవ్కు మంత్రి
ఉత్తమకుమార్రెడ్డి లేఖ
మన తెలంగాణ/ హైదరాబాద్ : పోలవరం ప్రా జె క్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చే శారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యవరణ,అటవీ శాఖమంత్రి భూపేందర్ యా దవ్కు బహిరంగ లేఖ రాశారు. ఎపి ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో పాటు ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని, ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఎపి ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎలాం టి అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విస్తరణ కు పాల్పడుతుందని మంత్రి ఉత్తమ్ ఆరోపించా రు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తో పా టు సాంకేతిక సలహా మండలి సూచనలకు వ్య తిరేకంగా ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖా నుంచి 2005 అక్టోబరు 25 న అనుమతి లభించిన విషయాన్ని ఆయన తన లేఖలో గుర్తుచేశారు. కాలక్రమంలో ఎపి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఇదే విషయమై 2011 ఫిబ్రవరి 8 న కేంద్రం పనులను నిలిపి వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎపి చర్యలపై తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ పనులు కొనసాగుతుండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికి ప్రాథమికంగా ఆమోదించిన భాగాలకు మాత్రమే నిధులు రీఎంబర్స్మెంట్ కొనసాగుతుందని, అయినప్పటికీ ఎపి ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి భారీ మార్పుల చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ‘
ప్రాజెక్టు విస్తరణ పై 2022 సెప్టెంబర్ 6వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సాంకేతిక నివేదికలు అవసరం అవుతాయని పేర్కొన్న విషయాన్ని మంత్రి ఆ లేఖలో ప్రస్తావించారు. పైగా పర్యావరణ అనుమతులు కూడా అవసరం ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో ఉటంకించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట ఆమోదించిన ప్రమాణాల ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎపిప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా కుడి కాలువ హెడ్ స్లూయిస్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం నుంచి 40 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యానికి పెంచుతూ డిజైన్ లో మార్పులు చేసిందన్నారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ(ఇ.ఏ.సి) పరిగణనలోకి తీసుకోవద్దని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, ఎపి ప్రతిపాదనలను ఇ.ఏ.సి సమావేశంలో తిరస్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.