మహబూబాబాద్: వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్కి తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ ట్రైన్ మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అప్ లైన్లో 428/11 వద్ద రైల్వే ట్రాక్పై వచ్చిన ఎద్దును బలంగా ఢీకొట్టింది. దీంతో కొన్ని నిమిషాల పాటు రైలు ట్రాక్పై నిలిచిపోయింది. వందేభారత్ సిబ్బంది రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించగా.. వాళ్లు ఘటనస్థలికి చేరుకొని ట్రాక్పై నుంచి ఎద్దును తొలగించారు.
ఈ ఘటనలో వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat) ముందు భాగం విరిగిపోయింది. ఆ తర్వాత రైలు యధావిధిగా సికింద్రాబాద్కు బయలుదేరింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రాక్పై నిలిచిపోవడంతో ఆదే ట్రాక్పై వచ్చే ఇతర రైళ్లను కొంత సమయం నిలిపివేశారు. ఈ సమయంలో వందేభారత్లోని ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడ్డారు. మరోవైపు ఎద్దు యజమాని కోసం సమీప రైల్వేస్టేషన్ అధికారులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.