టీం ఇండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy).. ఈ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన ఈ మిస్టరీ స్పిన్నర్ 9 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆగస్టులో బంగ్లాదేశ్తో జరిగే వన్డే, టి-20 సిరీస్పై దృష్టి సారిస్తున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పాల్గొన్నాడు.
ఈ ఇంటర్వ్యూలో టి-20 ఫార్మాట్లో ఆల్టైమ్ డీం టీమ్ను చెప్పాలని అశ్విన్.. వరుణ్ని (Varun Chakravarthy) కోరాడు. కానీ, తాను ఇప్పటివరకూ ఆడిన ఆటగాళ్లే అందులో ఉండాలని షరతు పెట్టాడు. దీంతో వరుణ్.. టీం ఇండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే తన డ్రీం టీమ్ను ప్రకటించాడు. ఇందులో జోస్ బట్లర్, ట్రవిస్ హెడ్ ఓపెనర్లుగా.. మూడో స్థానంలో భారత టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చోటు కల్పించాడు. ఆ తర్వాతి స్థానంలో నికొలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్, హార్థిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మతిశ పతిరాణాలను ఎంపిక చేశాడు.
అయితే 2021లో టి-20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే వరుణ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో రోహిత్ శర్మ సారథ్యంలో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అయినా కూడా వీరిద్దరి పేరు వరుణ్ చెప్పకపోవడం విశేషం.