విజయ్ రూపానీ భౌతిక కాయం అప్పగింత
32 మృతదేహాల అవశేషాలకు డిఎన్ఎ పూర్తి
వారి వారి బంధువులకు అందించే ఏర్పాట్లు
మృతులు ఎవరెవరు తేల్చడం సంక్లిష్టం
అహ్మదాబాద్ : గుజరాత్ రెండుసార్ల ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. దీనితో ఈ నెల 12 నాటి బోయింగ్ విమాన ప్రమాదంలో ఆయన కూడా మృతులలో ఉన్న విషయం సశాస్త్రీయంగా నిర్థారణ అయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. చాలా మంది శరీరాలు గుర్తు పట్టడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయి. వీరి గుర్తింపు కోసం శాస్త్రీయ విధానం డిఎన్ఎ పరీక్షలు చేపట్టారు. ఇప్పటికీ 32 మంది విధి వంచితుల భౌతికకాయాలను డిఎన్ఎ పరీక్షల ద్వారా గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. గుర్తించిన వాటిలో 14 శవాలను వారి వారి బంధువులకు అప్పగించారు. ఇప్పుడు విజయ్రూపానీ భౌతిక కాయాన్ని వారి సమీప బంధువులు తీసుకువెళ్లారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 241 మంది . కాగా ఇతరులు 29 మంది వరకూ చనిపోయారు. ఈ విధంగా మొత్తం 270 మంది చనిపోయిన ఈ ఘటన భారతదేశంలో జరిగిన అత్యంత పెను విమాన ప్రమాదాలలో ఒక్కటిగా నిలిచింది. రూపానీ మృతదేహాన్ని మధ్యాహ్నం 11 గంటల తరువాత గుర్తించారు. పుట్టెడు శోకంతో రూపానీ బంధువులు ఆయన అవశేషాలను తీసుకువెళ్లి , అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆయన భౌతిక కాయాన్నిగుర్తించినట్లు, రాజ్కోట్లో తుది కర్మకాండ జరిగేందుకు ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రిషికేష్ పటేల్ విలేకరులకు తెలిపారు.
దూరప్రాంతాల వారి పడిగాపులు
విమాన ప్రమాద బాధితులలో చాలా మంది గుజరాత్, మణిపూర్ ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. తమ వారి శవాలను అయినా తీసుకువెళ్లాలని చాలా కుటుంబాలు అహ్మదాబాద్కు వచ్చాయి. అయితే వరుస క్రమంలో అత్యంత క్లిష్టమైన డిఎన్ఎ పరీక్షలు జరగాల్సి ఉంది. దీనితో తమ వారి కడచూపు తరుదాతి అంతిమయాత్రల కోసం బాధిత కుటుంబాల వారు పడిగాపులు పడాల్సి వస్తోంది. డిఎన్ఎ పరీక్షల ప్రక్రియ సజావుగా సాగించేందుకు, భౌతికకాయాలను అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని గుజరాత్ అధికారులు తెలిపారు. పోస్టుమార్టం , తరువాతి డిఎన్ఎ పరీక్షల ఘట్టాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియచేస్తున్నారు. 32 మంది భౌతికకాయాలను ఇప్పటికీ గుర్తించారని ఆయన వివరించారు.