18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కల నెరవేరింది. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్లో ఆ జట్టు ఛాంపియన్గా నిలిచింది. మొదటి సీజన్ నుంచి జట్టుతోనే ఉన్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ సందర్భంగా మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ట్రోఫీని అందుకొని ముద్దాడాడు. అయితే ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. బెంగళూరులో ఆర్సిబి విజయోత్సవ సభ కోసం వేలాది మంది అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై బెంగళూరు జట్టు విషాదం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితమే ‘ఆర్సిబి కేర్స్’ అంటూ మృతుల కుటుంబాల రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. అభిమానులకు ‘ఆర్సిబి కేర్స్’ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజా సంతాపం తెలియజేశాడు. 18 ఏళ్ల తర్వాత కప్ అందుకున్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయిందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘జూన్ 4న హృదయ విదారక ఘటన జరిగింది. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం తీవ్ర విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం.. గాయపడిన వారికోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీకు కలిగిన నష్టం ఇప్పుడు మాలో భాగం. ఇక నుంచి మరింత జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతగా కలిసి కట్టుగా ముందుకు సాగుతాం’’ అంటూ విరాట్ సోషల్మీడియాలో పోస్ట్ పెట్టాడు.
Also Read : సంజూ శాంసన్ను టాప్ ఆర్డర్లో ఆడించాలి: ఆకాశ్ చోప్రా