Sunday, September 14, 2025

అవసరమైతే ఆబ్కారీకి ఆయుధాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమకు ప్రజల ప్రా ణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అ ప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు ఏమిటీ? ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు అప్పగించారా? దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు.

ఫాంహౌస్‌లపై ప్రత్యేక నిఘా పెట్టాలి
గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణాపై ఫోకస్ పెట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని మంత్రి సూచించారు. ఫాంహౌస్ లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ఒకే లైసెన్స్‌పై ఎక్కువ బార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు.
సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయం
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యాన్ని, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపాలని ఆయా విభాగాల అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. ఇందుకుగాను సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయంతో పాటు వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్‌లను గుర్తించి వారిని పిడి యాక్టు కింద అరెస్టు చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. యువత భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల లాంటి మత్తు పదార్ధాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

చర్లపల్లి లాంటి ఘటనలతో విశ్వనీయతను కొల్పేయే ప్రమాదం
అలాగే సరిహద్దు రాష్ట్రాల చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని మంత్రి జూపల్లి చెప్పారు. నిఘాను కేవలం చెక్కు పోస్టులకే పరిమితం కాకుండా ఇతర మార్గాలు, సమాచారం కోసం నిఘాను ముమ్మరం చేసి దీనిలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా తయారీ అమ్మకాలు, కల్తీ మద్యం తయారీతో పాటు ఎన్‌డిపిఎస్ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడమే కాకుండా, నమోదు చేసిన కేసుల్లో ఎంతమంది నిందితులకు పడుతున్నాయి? అని ఆరా తీశారు. కేసు నమోదు, పంచనామా నుంచి చార్జీషీట్ దాఖలు, ట్రయల్ సందర్భంలో సమర్ధవంతంగా వాదనలు వినిపించి నిందితులకు శిక్షలు పడే వరకు విశ్రమించకుండా పని చేయాలని మంత్రి జూపల్లి సూచించారు. చర్లపల్లిలోని ఓ ప్యాకర్టీలో డ్రగ్స్ ముడిసరుకు తయారీ కేసులో పురోగతి,

ఎక్సైజ్ శాఖ తనిఖీ, బయటపడ్డ అంశాలపై ఇచ్చిన నివేదిక గురించి మంత్రి ఆరా తీశారు. మహారాష్ట్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులో ఏముందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులు, ఇతర వస్తువుల విలువ రూ. 12,000 కోట్లుగా వార్తలు వచ్చాయని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని, స్వాధీనం చేసుకున్న వాస్తవ విలువ గురించి మహారాష్ట్ర పోలీసుల నుంచి ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు. చర్లపల్లి వంటి ఘటనల వల్ల మన విశ్వనీయతను కొల్పేయే ప్రమాదం ఉందని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా నిఘాను మరింత పటిష్టం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో విస్తృత సోదాలు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

ఒక బారుకు అనుమతి తీసుకొని రెండు మూడు బార్లు
గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్ లో ఇప్ప సారా (మహూవా) వంటి సంప్రదాయ మద్యాన్ని బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారని, తెలంగాణలో ఈత, తాటి కల్లును కూడా అదే తరహాలో టాడి నేచురల్ బ్రూవరి నెలకొల్పి బాట్లింగ్ చేసి విక్రయించే యూనిట్ లను నెలకొల్పడం వల్ల గీత కార్మికులకు ఉపాధితో పాటు ఆదాయం పెరుగుతుందని, కల్తీ కల్లును కూడా నివారించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి సూచించారు. నివేదిక ఆధారంగా సిఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్జయం తీసుకుంటామని అన్నారు. దాడుల సందర్భంలో స్వాధీనం చేసుకున్న నల్లబెల్లాన్ని వృధాగా పారబోయకుండా దానిని రైతులకు విక్రయించడానికి ఉన్న నిబంధనలు ఏమిటీ? అదే విధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ధ్వంసం చేయకుండా,

దాని నాణ్యతను ల్యాబ్ లో పరీక్షించి, తిరిగి విక్రయించేందుకు ఉన్న అడ్డంకులు, నిబంధనలపై అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక బారుకు అనుమతి తీసుకుని , రెండు మూడు బార్లను నడుపుతుండటంతో పాటు ఒక అంతస్తులో బారు నడపడానికి అనుమతి తీసుకొని రెండు, మూడు అంతస్తుల్లో బార్లను నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News