ఆగర్భ శత్రువులైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న పోరుతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటోంది. ఇటీవల ఇరాన్తో అమెరికా జరిపిన అణుచర్చలు విఫలం కావడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇజ్రాయెల్ అమెరికా దన్నుతో దాడులు మొదలు పెట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్ లోని అణుకేంద్రాలతోపాటు సైనిక స్థావరాలను లక్షంగా చేసుకుని క్షిపణులు కురిపిస్తోంది. అతిపెద్ద నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ మహమ్మద్బాఘెరీ, ఖాత్ అల్ అన్బియా హెడ్క్వార్టర్స్ చీఫ్ అలి రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలాషంఖాని సహా ఆరుగురు అణుశాస్త్రవేత్తలు, పలువురు కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అత్యయిక స్థితిని ప్రకటించగా, ఇజ్రాయెల్ దేశమంతా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఇరాన్ కూడా కొన్నిగంటల్లోనే ఇజ్రాయెల్పై వందకు పైగా డ్రోన్లతో దాడి చేసింది. వాటిని కూల్చివేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ అణుకార్యక్రమానికి గుండెకాయ వంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించగా, ఈ దాడులకు ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. ఎప్పుడూ లేని విధంగా నివాస ప్రాంతాలపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ తమ దుష్టబుద్ధిని చాటుకుందని ఆగ్రహించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటక ముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. తాను చెప్పినట్టు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చామన్నారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని, తరువాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. అంటే ఒక విధంగా ఇజ్రాయెల్ దాడికి అమెరికా పూర్తిగా సమర్ధిస్తున్నట్టే. ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇవి ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, భద్రతను బలహీనపరుస్తాయని ఆగ్రహించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందని తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలకు చిరకాల మిత్రదేశంగా ఉన్న భారత్ ఈ దాడులకు తీవ్రంగా స్పందించింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా, దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది.
ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాయం చేస్తామని చెప్పింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో ఈ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి అక్కడి మన ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించాలని, ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచాతెలుసుకోవాలని పేర్కొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి. ఇరాన్ గత కొన్నేళ్లుగా భారీ ఎత్తున యురేనియం నిల్వలు చేస్తున్నట్టు బయటపడింది. 2003 వరకు ఇరాన్ రహస్య అణ్వాయుధాలను అభివృద్ధి చేసిందని పాశ్చాత్య దేశాలు నిరూపిస్తున్నాయి.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఎఇఎ) బోర్డు గుర్తించింది. ఈ విధమైన ప్రకటన ఐఎఇఐ చేయడం గత ఇరవై ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బ్రిటన్, జర్మనీ, అమెరికా దేశాలతోపాటు ఐఎఇఏ బోర్డు గవర్నర్లు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. ఈ పరిస్థితి భారత్లో స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు అలాగే కొనసాగుతున్నాయి.ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,600 దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 12 శాతం పెరిగాయి.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ 12.6 శాతం పెరిగి 76.61 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ 12.2 శాతం పెరిగి 77.77 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరగడమే కాకుండా చమురు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనలు పెరిగాయి. దీంతో చమురు రంగ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 6.1 శాతం తగ్గి రూ. 299.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు 3.9 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 5.3 శాతం నష్టపోయాయి. ఒమన్ ఇరాన్ సముద్ర మార్గంలో హర్మోజ్ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్ల (21 మిలియన్ ) బ్యారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది.