Tuesday, June 3, 2025

మాతృభాషంటే?

- Advertisement -
- Advertisement -

జ్ఞాన ప్రసరణలోమాతృ భాష -పరాయి భాష లు, ఉష్ణ ప్రసరణలో వెండి ఇనుము లాంటివి. సమాజం ద్వారా వ్యక్తిలోకి ప్రవేశం, స్వీయ చలనం గల ఒక సజీవ జ్ఞాన వాహకమే కానీ అదే జ్ఞానం కాదు. విద్యుత్తుకి, ఉష్ణానికీ మంచి వాహకాలు చెడ్డ వాహకాలూ ఉన్నట్లే, జ్ఞానానికి అత్యుత్తమ వాహకం మాతృభాష. ఇది శాస్త్రమే కానీ విశ్వాస సంబంధి కాదు. దానిని కేవలం భావోద్వేగాలకే పరిమితం చేసి మాట్లాడటమంటే చర్చ ను పక్కదారి పట్టించినట్లు. ఇనుము ద్వారా విద్యుత్తు ప్రవహించదని ఎవరన్నా తప్పే. కానీ తరగనంత వెండిలోహం లాంటి మాతృభాష ఉండగా పరాయిభాష లాంటి ఇనుమును వాహకంగా వినియోగించాలనటాన్ని ఏమైనా అనొ చ్చు కానీ శాస్త్రమనటం అజ్ఞానమో, దాచిపెట్టుకున్న దుష్ట వ్యాపార ప్రయోజనమో తప్ప మరొకటి కాదు. ఉద్వేగాలను సృష్టించాల్సిన అవస రం స్వార్ధ రాజకీయులకే వుంటుంది. శాస్త్ర ప్రమాణంతో చర్చలకు మాత్రమే అంతిమ విజయమూ, విలువ వుంటాయి.

బోధనా మాధ్యమంగా మాతృభాష ఆవశ్యకతను చర్చించుకునే ముందు భాషా తత్వంలోని కొన్ని మౌలిక అంశాలను తెలుసుకోవలసి ఉం ది. భాష ఒక సామాజిక శక్తి. విలువల వ్యవస్థ. జాతి జనుల సాంస్కృతిక వారసత్వం ద్వారా మాత్రమే నూతన తరాలకు అది అలవడుతుంది. ప్రాథమికంగా అది మౌఖికంగా ఉంటుంది. అభివృద్ధి క్రమంలో అక్షర రూపంలో కూడా ఉంటుం ది. భాషంటే ఒక జాతి జనుల ఉచ్చ్వాస నిశ్వాసలు. ఆ జాతి ప్రజలకు ఉండే అనురాగం, ఆగ్రహం, ఆనందం, విషాదం, సంతోషం, ఆవేశం, విజ్ఞానం, సృజన, ప్రయోగం, పరిశోధన ఉత్పత్తి – పంపిణీ, సాహిత్యం కళలు మొదలైన సమస్త జీవన రంగాల అనుభవాలు, అనుభూతులన్నీ ఆ జాతి భాష రూపంలోనే వ్యక్తమవుతాయి. మానవుని ఊహ, ఆలోచన, హేతుబద్ధ విశ్లేషణ, శాస్త్రీయ సంశ్లేషణ, సృజనాత్మక వ్యక్తీకరణ, అంతరంగిక భావ సంఘర్షణలన్నీ మాతృభాషలోనే జరుగుతాయి. మనిషి ఊహల భాష, కలల భాష మాతృభాష. ఆనందాల భాష ఆవేదనల భాష మాతృభాష. ఉద్వేగాల భాష, ఉత్సాహ ఉద్రేకాల భాష మాతృభాష.

మాతృభాషలో విద్య సులభ గ్రహణ శక్తికి స్పష్టమైన వ్యక్తీకరణకు ఏకైక సాధనం. ఊహకూ కాల్పనిక శక్తికి సృజనాత్మకతకు అది ప్రాణం పోస్తుంది. ఎంతటి క్లిష్టమైన భావాన్నైనా గొప్ప అభివ్యక్తితో స్పష్టం చేయగల శక్తి, ప్రస్ఫుట స్వరసంపద తెలుగు భాషకుంది. గొప్ప సాహిత్య భాష గానూ వైజ్ఞానిక భాషగానూ రాణించగల సామర్థ్యం దానికి ఉంది. ఇతర భాషలలోని పద సంపదను సులువుగా సామరస్యంగా తనలో సంలీనం చేసుకునే విశేషశక్తి కూడా తెలుగు భాషకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, భాష అనేది ప్రతి ప్రత్యేక జాతికి ఒక తరం నుండి మరొక తరానికి ప్రసరిస్తూ, జాతి జనుల తరతరాల అనుభవాల సారాన్ని జ్ఞానాన్ని బహుముఖాలుగా అందజేస్తూ ఉండే ఏకైక సాంస్కృతిక సజీవ వాహిక. అందుకే శ్రీకాకుళం కావ్య కవి, సామాజిక ఉపాధ్యాయుడు అయిన ఛాయరాజ్ ‘పుట్టుక వద్ద, చావు వద్ద పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను’ అన్నారు.
దివికుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News