సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో నైరుతి పవనాలు ప్రవేశిస్తాయని, జూన్ 5 నాటికి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని అనుకున్నారు. కానీ కేరళలో రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. రైతులంతా నైరుతికి స్వాగతం పలికారు. కానీ కేరళ నుంచి రుతుపవనాలు ఉధృతంగా ప్రవేశించి తదుపరి ఉత్తర దిశగా పయనించి అపార విధ్వంసాన్ని సృష్టించాయి. రుతుపవనాల్లో ఇది అరేబియా సముద్ర విభాగం. కేరళలో ప్రారంభమైన ఒకటి రెండు రోజుల తరువాత కొన్ని సార్లు ఏకకాలంలో బంగాళాఖాతం విభాగం రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో తరచుగా ప్రవేశించడం జరుగుతుంది.
అయితే ఈ తూర్పు ప్రారంభం వరదలకు, కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతోంది. సాధారణంగా జూన్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అనుకుంటారే తప్ప వరదల బీభత్సం ముంచుకొస్తుందని అనుకోరు. వాతావరణ విభాగం కూడా సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుందని అంచనా వేసింది. కానీ రుతుపవనాల ప్రాథమిక స్థాయి దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించింది. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఏడాది పొడుగునా నీటికి కరువై, ఒక్కసారి ఈ విధంగా కుంభవృష్టి కురుస్తుండడం ఒక సవాలుగా మారింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో చిన్నపాటి రుతుపవనాల వంటి వాతావరణం కనిపించింది. ఏడాది పొడుగునా ఈశాన్య రాష్ట్రాల దుర్బలత్వాన్ని అంచనా వేసి ఒక ప్రణాళికను రూపొందించడం అవసరం. చారిత్రకంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అంతగా జరగలేదు.
భౌగోళిక పరిస్థితులు ఒక సవాలుగా నిలవడం ఒక కారణం. బాధిత రాష్ట్రాలనన్నిటినీ కలుపుకుని కేంద్రం క్రమబద్ధమైన సమీక్ష నిర్వహించాలి. ఏటేటా వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వైపరీత్యాలతో అపార ప్రాణనష్టం జరగకుండా, అలాగే విధ్వంసం సంభవించకుండా నివారించడానికి స్థిరమైన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం తప్పనిసరి. నైరుతి పవనాల ప్రభావంతో గత వారం రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కి, అసోం, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయల్లో కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు కూలుతున్నాయి. ఈ బీభత్సానికి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
అసోంలో 10 ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 19 జిల్లాల్లోని మూడు లక్షల మంది వరదలకు బాధితులయ్యారు. త్రిపురలో అనేక జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. ఉత్తర సిక్కింలో కొండచరియలు విరిగిపడడంతో 1500 మంది టూరిస్టులు ఇరుక్కున్నారు. మూడేళ్ల క్రితం భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాల్లో 125 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కొండచరియల ప్రమాదాలపై 2020 లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం నిర్వహించింది. దేశం లోని 16 రాష్ట్రాలు, హిమాలయ రీజియన్లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతా లు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు, ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా అధ్యయనం గుర్తించింది. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఒక ప్రణాళిక లేకుండా సాగించే కొండ క్వారీ పనులు ఇవన్నీ కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని అధ్యయనం హెచ్చరించింది. అలాగే కొండచరియలు విరిగిపడడానికి 51 శాతం అనువైన ప్రాంతం ఉత్తరాఖండ్ అని వాడియా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోనే భూకంపాలు సంభవించే ఆరో ప్రాంతంగా ఈశాన్య ప్రాంతం ఉంటోంది.
ఈ ప్రాంతాల్లో ఆరు నెలలపాటు భారీగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొండచరియల ముప్పు తప్పించడానికి నిర్మాణాత్మక ఇంజినీరింగ్ పనులు చేపట్టడం అవసరమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచిస్తోంది. నేల స్వభావం పరిశీలించకుండా, పోడు వ్యవసాయం వంటివి నివారించకుండా కొండచరియల ముప్పును తప్పించే మార్గాలు అన్వేషించకుండా ఎలాంటి అభివృద్ధి నిర్మాణాలు చేపట్టినా, ప్రమాదమేనని భౌగోళిక సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలతో అత్యధిక సంఖ్యలో చెట్లను కూల్చివేస్తున్నారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో 10.76 మిలియన్ చెట్లను కూల్చివేశారు. కొండలను తొలిచి సొరంగాలు నిర్మిస్తున్నారు. దీంతో నేల దృఢత్వం దెబ్బతిని కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు మట్టిలో మట్టై పోయినప్పుడు లబోదిబోమనడం, నష్టం ఎంతవరకు జరిగిందో సమీక్షించడం తప్ప ఈ విధ్వంసానికి దారి తీసే కారణాలేమిటో, వాటిని ఎలా నివారించగలమో అన్న దిశలో ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ప్రకృతి పరంగా కొన్ని ప్రమాదాలు జరుగుతుండగా, మానవ బాధ్యతారాహిత్య చర్యల వల్ల అంతకన్నా ఎక్కువగానే నష్టం జరుగుతోంది. వీటిని అడ్డుకోవడానికి సరైన ప్రణాళికలు అమలు కావడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతున్న జనాభాకు తగినట్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగకపోవడం ప్రధాన లోపం. సౌకర్యాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య నెలకొన్న సంక్లిష్టతపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో శాస్త్రీయ విశ్లేషణ అనుసరించి నిర్మాణాలు చేపట్టడం అవసరం.