ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో రెండు వారాలలో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జూన్ 19 నే నిర్ణయించారు. రెండు రోజుల తర్వాత ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై బి-2 బాంబర్లతో అమెరికా విరుచుకు పడింది. ఇప్పటికైనా ఇరాన్ శాంతి మార్గాన్ని అనుసరించని పక్షంలో తర్వాత జరిగే దాడులు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ మీడియా సమావేశంలో హెచ్చరించారు. ట్రంప్ రెండు వారాల గడువు పెట్టినప్పటికీ,ఏ క్షణంలో నైనా ఇరాన్ పై బాంబులవర్షం కురిపించే ప్లాన్ లో వైట్ హౌస్ నిమగ్నమై ఉంది. అత్యంత గోప్యంగా ఈ విషయాన్ని ఉంచారు. కేవలం కొద్దిమందికే ఈ విషయం తెలుసునని వాషింగ్టన్ పోస్ట్ ఓ రిపోర్ట్ లో పేర్కొంది.ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ చాలా వ్యూహాత్మక నిర్ణయం అని, ఎప్పుడు ఏ సమయంలో, ఏ విధంగా ఈ ఆపరేషన్ జరుగుతుందని చాలా తక్కువమందికే తెలుసునని, దాడుల తర్వాత అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు.
ఆపరేషన్ పై ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేసిన తర్వాతే వాషింగ్టన్ లో చాలా మంది సీనియర్ అధికారులకు ఈ దాడుల గురించి తెలిసింది.ట్రంప్ రెండు వారాల గడువు.. ఇరానియన్లకు షాక్ ఇచ్చే ప్రయత్నం అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.ఇరాన్ -ఇజ్రాయెల్ వివాదం తీవ్రతరం కాకుండా నివారించేందుకు ఎలాంటి సర్జికల్ ఆపరేషన్ ప్లాన్ చేశారని ట్రంప్
అధికారులను ప్రశ్నించారు. అమెరికా వైమానిక దళ విమానాలు ఇరాన్ గగనతలాన్ని చేరేవరకూ , ఏ క్షణంలోనైనా తాను తన ప్రణాళికను రద్దు చేసుకోవచ్చునని ట్రంప్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.వివాదానికి దౌత్యపరమైన పరిష్కారం కోసమే తను ఇరాన్ పై ఒత్తిడి తెచ్చినట్లు ట్రంప్ అమెరికా అధికారులకు తెలిపారు. అయితే చర్చల సమయంలో ఇరాన్ ఈ విషయంలో షరతులను అంగీకరించక పోవడంతో సైనిక చర్యపై మొగ్గు చూపారు. శుక్రవారం నాడు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘ్చీ యురోపియన్ నాయకులను కలిశారు. చర్చలలో పురోగతి ఉండదని ట్రంప్ కు తెలుసునని అందుకే, సైనిక చర్యకు ప్రణాళిక సిద్ధమైందని ఓ అధికారి తెలిపారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం యురోపియన్ దేశాలు ప్రయత్నించినా, ఇరాన్ ఆసక్తి చూపలేదని ఆ అధికారి అన్నారు. ఆపరేషన్ పై ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్
జేడి వాన్స్, ఇతర ముఖ్య సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చారు.
శనివారం స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి దూసుకు వెళ్లిన తర్వాత ట్రంప్, వాన్స్ తమతమ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగారు. ట్రంప్ న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్ కు వెళ్లారు. వాన్స్ కాలిఫోర్నియా నుంచి విమానంలో వస్తున్నారు. బాంబర్లు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ చేసుకున్నారు. అప్పుడే వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ లోని అణుకేంద్రాలను బాంబర్లు నేలమట్టం చేసి, వెనుదిరిగిన 20 నిముషాల తర్వాత ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో దాడులపై ప్రకటన చేశారు. ఆపరేషన్ సమయంలో ట్రంప్ , వాన్స్ సిట్యుయేషన్ రూమ్ లో ఉన్నారు. వారి తో పాటు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్ ఇతరులు ఉన్నారు. ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ కు 9 రోజుల ముందు విదేశాంగమంత్రి రూబియా ఇరాన్ పై ఇజ్రాయెల్ చర్య ఏకపక్షమైనదని, అమెరికా ప్రమేయం లేదని ప్రకటించారు. కానీ, తర్వాత అమెరికా ఆలోచన మారింది. సోమవారం ట్రంప్ ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ఎక్కడ దాగారో తెలుసునని, అయితే ప్రస్తుతానికి చంపబోమని హెచ్చరించారు. మర్నాడే ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికాను ఒకే యూనిట్ గా ప్రస్తావించడం, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిలో అమెరికా విమానాలను వినియోగించాలని ప్రకటించడం తర్వాత అమెరికా
ఆలోచన మారిందని భావిస్తున్నారు.