న్యూఢిల్లీ: భార్యతో కలిసి హనీమూన్ కు వచ్చిన ఇండోర్ వ్యక్తి మేఘాలయలో దారుణ హత్యకు గురైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యనే భర్త హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో అతని భార్యను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ.. 28 ఏళ్ల రాజా రఘువంశీ హత్యకు భార్య సోనమ్ హనీమూన్ సమయంలో హంతకులను నియమించుకుని కుట్ర పన్నారని తెలిపారు.
ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట మే నెలలో మేఘాలయకు చేరుకుని అక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించారు. వారు చివరిసారిగా మే 23న సోహ్రా (చిరాపుంజీ) ప్రాంతంలో కనిపించారు. తర్వాత వారు కనిపించకుండా పోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో జూన్ 2న చిరపుంజి సమీపంలోని సోహ్రారిమ్ వద్ద ఉన్న లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనుగొన్నారు. ఆ జంట అదృశ్యమైన రోజున మరో ముగ్గురు వ్యక్తులతో కనిపించారని స్థానిక టూరిస్ట్ గైడ్ పోలీసులకు చెప్పాడు. తర్వాత 17 రోజులుగా కనిపించకుండా పోయిన సోనమ్ ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని రోడ్డు పక్కన ఉన్న ఓ తినుబండారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రజా హత్య కేసులో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.