రాష్ట్రంలో ఆర్టిసి ప్రయాణీకులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిసి బస్సుల్లో వైఫై సేవలు అందించేందుకు ఓ ప్రైవేటు సంస్థ రవాణా శాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే ఆర్టిసి బస్సుల్లో వైఫై సేవలు అందుబాటులోకి రావడానికి ఎంతో కాలం పట్టదని తెలుస్తోంది. బస్సుల్లో ప్రయాణించేవారికి వై-ఫై సదుపాయాన్ని అందించే విషయంపై ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఇటీవల ఆర్టిసికి ప్రతిపాదనలు అందాయి. సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి, ఆర్టిఎపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు ఈ విషయంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినుట్ల సమాచారం.
బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాలలో ఈ సదుపాయాన్ని అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా అప్లోడెడ్ కంటెంట్ను వై-ఫై ద్వారా మొబైళ్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. తద్వారా ముందే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితా మాత్రమే చూడటానికి వీలుంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలూ వస్తుంటాయి. ఈ యాడ్స్తో ఆ సంస్థకు ఆదాయం ఉంటుందని ఆర్టిసి వర్గాల సమాచారం. త్వరలో ఆ సంస్థ ప్రతినిధులు, ఆర్టిసి అధికారుల మధ్య ఈ విషయమై మరో సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.