కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు బహిర్గతం చేస్తూనే ఉంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు ఎసిబి కార్యాలయంలో కెటిఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ లో స్పందిస్తూ.. “మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం” అని పేర్కొన్నారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి గత నెల 28న విచారణకు హాజరుకావాల్సిందిగా మే 26న కెటిఆర్కు ఎసిబి నోటీసులు పంపించగా.. తాను అమెరికా పర్యటనలో ఉన్నానని, విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఎసిబికి కెటిఆర్ సమాచారం ఇచ్చారు. దానికి అంగీకారం తెలిపిన ఎసిబి.. ఇటీవల మరోసారి కెటిఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో జనవరి 8న తొలిసారి కెటిఆర్ ను 7 గంటల పాటు ఎసిబి విచారించింది.