పార్టీ తరపున త్వరలో యాప్ తెచ్చే ఆలోచన
ఏం జరిగినా యాప్లో అప్లోడ్ చేయండి
ప్రభుత్వ వేధింపులు, అన్యాయాలను వెంటనే నమోదు చేయవచ్చు
ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మన తెలంగాణ /అమరావతి: అన్యాయం జరిగినా.. తప్పు జరిగినా..ఆ యాప్లో అప్లోడ్ చేయండి..మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెడ్బుక్ తీసుకువచ్చిన నారా లోకేష్ తప్పుచేసినవారిని వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కేసులు పెట్టినా అది రెడ్బుక్ ప్రకారమే జరిగుతోందని రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ డిజిటల్ ఉద్యమానికి తెరలేపేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఓ యాప్ తీసుకు వస్తున్నామని వెల్లడించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పార్టీ తరపున యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే ఆ యాప్లో నమోదు చేయవచ్చన్నారు. ఫలానా వ్యక్తి, ఫలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుందని, అయితే ఆ ఫిర్యాదులపై మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిశీలన చేస్తామని జగన్ వెల్లడించారు. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయవచ్చని, ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని మరోసారి వైఎస్ జగన్ హెచ్చరించారు.