ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ 2025 ఈరోజు(జూన్ 30వ తేదీ, సోమవారం) నుండి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం వింబుల్డన్ టోర్నమెంట్ సరికొత్త టెక్నాలజీతో జరగబోతోంది. 147 సంవత్సరాల వింబుల్డన్ చరిత్రలో మొదటిసారిగా మానవ లైన్ జడ్జీలు లేకుండా నిర్వహించనున్నారు. జడ్జీల స్థానంలో 450 కంటే ఎక్కువ ట్రాకింగ్ కెమెరాలతో కూడిన పూర్తిగా ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ లైన్-కాలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, లైన్ జడ్జిలు లేకపోవడం, కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థ దోషరహిత తీర్పు వచ్చే అవకాశం కూడా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇవాళ్టి నుంచి జూలై 13 వరకు ఈ మెగా టోర్నమెంట్ 14 రోజుల పాటు కొనసాగనుంది.
భారీగా ప్రైజ్ మనీ
ఈసారి వింబుల్డన్ ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో రూ.622 కోట్లకు (53.5 మిలియన్ పౌండ్లు) పెంచారు. ఇది, గత సంవత్సరం కంటే దాదాపు రూ.41 కోట్లు ఎక్కువ. మొదటి రౌండ్లో ఓడిపోయిన ఆటగాడికి దాదాపు రూ.76.80 లక్షలు (66,000 పౌండ్లు) లభిస్తాయి. ఇది గతసారి కంటే 10శాతం ఎక్కువ. డబుల్స్ విజేతలు రూ.6,80,000 (రూ.7.87 కోట్లు) అందుకుంటారు. అలాగే, మిక్స్డ్ డబుల్స్ విజేతలు రూ.1,35,000 (రూ. 1.56 కోట్లు) లభించనుంది.
హ్యాట్రిక్ టైటిల్ కోసం బరిలోకి అల్కరాజ్
రెండుసార్లు డిఫెండింగ్ పురుషుల ఛాంపియన్ అయిన స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్.. హ్యాట్రిక్ టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాడు. వింబుల్డన్ మొదటి రోజు సోమవారం పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో అల్కరాజ్ తలపడనున్నాడు. ఇక, మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా తన తొలి రౌండ్ మ్యాచ్లో కెనడా క్రీడాకారిణి కార్సన్ బ్రాన్స్టెయిన్ను ఢీకొనబోతోంది.