బోడుప్పల్: పేషెంట్లను కొడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నారంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలోని బెటర్ ఫ్యూచర్ రిహాబిలిటేషన్ సెంటర్ పై శనివారం ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రిహాబిలిటేషన్ సెంటర్ ను నడుపుతున్నారని.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు చేసిన మహిళ సత్యవాణి తెలిపిన వివరాల ప్రకారం.. “ఈ సెంటర్ లో ఏడు నెలల క్రితం నా కొడుకు దేవరపల్లి సుభాష్(25)ని చేర్పించడం జరిగింది. అప్పుడప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు నా కొడుకు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పేవాడు. మద్యానికి ఆడిక్టై కొన్ని నెలల క్రితం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నవాళ్లే.. ఈ సెంటర్ ను నడుపుతున్నారని, రాత్రి టైంలో మద్యం సేవించి అక్కడ ఉన్న పేషెంట్లను కొడుతూ చిత్రహింసలు పెడుతున్నారని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఇలాగే కొట్టడం వలన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అతని కుటుంబం పేదవారు కావడంతో వారిని మేనేజ్ చేసి కంప్లైంట్ ఇవ్వకుండా చేయడం జరిగింది. ఈ విషయాలు బయటకి చెప్పకుండా అక్కడ ఉన్న పేషెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురిచేయడం జరుగుతుంది” అని తెలిపింది. ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్లు ఎక్కడ ఉన్నా వీటిపైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.