అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం
ప్రపంచం గర్వించేలా యోగా డే నిర్వహణ
కర్నూలులో ఎపి సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
మన తెలంగాణ / అమరావతి : రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ(APSRTC bus) సదుపాయం కల్పిస్తామని ఎపి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతినెలా(APSRTC bus) మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు : రైతుబజార్లను 1999లో తానే ఏర్పాటు చేశానని, రైతులకు గిట్టుబాటుధర రావాలని, వినియోగ దారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. తాము తెచ్చిన రైతు బజార్ల వల్ల రైతులు లబ్ధి పొందారని, వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగిందని చెప్పారు. కర్నూలు సి క్యాంప్ రైతు బజారును రూ.6 కోట్లతో ఆదర్శ రైతుబజారుగా అభివృద్ధి చేస్తామని, పక్కనే ఉన్న స్థలంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 రైతు బజార్లు ఉన్నాయని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతు బజార్లకు సేంద్రియసాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తామని తెలిపారు.
ప్రపంచం గర్వించేలా యోగా డే : ప్రధాని మోదీ కూడా యోగా డేకు వస్తున్నారని, యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా. ఆఫ్లైన్, ఆన్లైన్లో యోగా శిక్షణ ఇస్తామన్నారు. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేయాలని, అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు.
చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నామని, రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, డ్వాక్రా, మెప్మా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారన్నారు. గ్రామాల్లో చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, చెత్తను వేరు చేసి రీసైక్లింగ్కు పంపిస్తే వాటిని మళ్లీ వాడతారని, జపాన్లో ఎక్కడా రోడ్ల మీద కాగితం కనిపించదని, అదీ సామాజిక బాధ్యత అన్నారు. ఆ దేశంలో రోడ్డుపై పేపర్ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తారని, మన రాష్ట్రంలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, ఎన్ఎండీ ఫరూఖ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రాం, జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.