హైదరాబాద్: మహాలక్ష్మి పథకం పేరిట ఉచిత ప్రయాణంతో కొందరు ఆందోళన చెందారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. మహిళలు ఉచిత ప్రయాణం చేసినా ప్రభుత్వం ఆర్టిసికి డబ్బులు చెల్లించిందని అన్నారు. సూర్యాపేటలో ఆయన ఆర్టిసి డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసిలో ప్రయాణించిన మహిళలకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేసిందని తెలియజేశారు. ఆర్టిసికి ప్రభుత్వం రూ. 6,088 కోట్లు చెల్లించిందని, ఆర్టిసి బస్సులు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పారు.
పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నందునే ఆర్టిసి నిలదొక్కుకుందని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిసిని ఆధునీకరిస్తున్నామని, ప్రజా ప్రభుత్వం చొరవతోనే ఆర్టిసి లాభాల బాటతో నడుస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టిసి సంస్థ ఉండేది కాదని, హైదరాబాద్ ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఒఆర్ఆర్ లోపల 2,800 బ్యాటరీ బస్సులు తీసుకు వచ్చాం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.