Sunday, June 15, 2025

పేదరికం తగ్గింది అంకెల్లోనే!

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఆకలి కోసం అన్నం, కాలక్షేపం కోసం తమాషాలు చూపెట్టండి. వాళ్లు ఎప్పటికీ మీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రతిఘటించరు, తిరుగుబాటు చేయరు’ అని క్రీస్తుశకం రెండవ శతాబ్దానికి చెందిన డెసిమస్ జునియర్ జువెనెయిల్స్ చేసిన హెచ్చరిక. ఇది తమాషాగానే అనిపించవచ్చు. కానీ ఇది ఈనాటికీ పరిపాలకులు తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. డెసిమస్ జునియస్ జువెనెయిల్స్ ఆనాటి రోమ్ సామ్రాజ్యంలో ఒక కవి. ఆయన తమాషా కవి. ఆయన రాసిన కవితల పుస్తకం పేరు కూడా ‘సెసైర్స్. కొంత మంది కవులు పది కవితలు రాసినా చరిత్రలో నిలిచిపోతారు. చాలా మందికి ఆయన చెప్పిన రెండు చిన్నపదాలు, వాటిని నేను తెలుగు కోసం విస్తరించి రాశాను. అవి “గివ్‌దెమ్ బ్రెడ్ అండ్ సర్కస్, అండ్ దేవిల్ నెవర్ రివోల్ట్‌” అంటే ఒక రెండు చిన్న వాక్యాలతో కొన్ని వేల పేజీల సారాంశాన్ని ఇమిడ్చాడు. అప్పటి నుంచి చాలా మంది రాజులు, చక్రవర్తులు ఇటువంటి విధానాలనే అవలంబిస్తున్నారు. ప్రజలు కూడా కొన్ని సార్లు ఇటువంటి కుటిల ఆలోచనలకు, విధానాలను లొంగిపోతున్నారు.

దానితో సమాజంలో సంక్షోభం (Crisis society) మరింత పెరిగి తీర్చలేని సమస్యలను సృష్టిస్తోంది. కోట్లాది మంది ప్రజలను ఇంకా ఎన్నో కష్టాల పాలు చేస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతున్నది. సమాజం పైకి కనిపించినంత సంతోషంగా, ప్రశాంతంగా లేదు. సముద్రంలో శక్తివంతమైన బడబాగ్ని దాగి ఉన్నట్టే ప్రజల్లో ఎంతో ఆవేదన, ఆవేశం దాగి ఉన్నవి. అయితే అవేవి వాళ్ల ఆలోచనల్లో రాకుండా చేయడానికి అంది వచ్చిన టెక్నాలజీని, రంగు రంగుల మాయా ప్రపంచాన్ని, జీవితాలే ఒక సర్కస్‌గా ఈ సమాజం, పాలకులు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వారేమీ చెప్పినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ప్రసారం చేసినా ప్రజల్లో చలనం లేదు. అది ఎంతటి విషాదమైనా క్షణాల్లో మరిచిపోగలిగే అపహాస్యమైన హాస్యాలతో కూడిన వినోదాలను ప్రజలకు వడ్డిస్తున్నారు. నిన్నటి ఘోరమైన విమాన ప్రమాదాన్ని కూడా మనం ఒకటి, రెండు రోజుల్లో మరిచిపోగలం. ఎందుకంటే మన ముందు మాయా ప్రపంచం సృష్టించిన సర్కస్ ఉన్నది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, ఇటీవల ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను తయారు చేసి మన మీద వదిలింది. మన దేశంలో 2011 12 సంవత్సరంలో 27.1 శాతంగా ఉన్న ఘోర కరువు 2022 23 వచ్చే సరికి అది 5.3 శాతానికి తగ్గిపోయింది. ఇది సంతోషకరమైన వార్తే. అయితే ఇది నిజమేనా? మన కళ్ళ ముందున్న పరిస్థితులు దానికి సాక్షంగా ఉన్నాయా? అనేది మనం పరిశీలించాలి. చాలామంది దాని నిజానిజాలు తేల్చడానికి ఉత్సాహం చూపడం లేదు. చాలా మంది మేధావులు మౌనంగా ఉన్నారు. ప్రజల విషయానికొస్తే, అది వాళ్ల దృష్టిలో కూడా లేదు. కొద్ది మంది, కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని కొంత చర్చచేసే ప్రయత్నం చేశాయి, చేస్తున్నాయి. అందరికి అందరూ సర్కస్‌లో లేరు, మాయా తెరలు కప్పుకొని జీవించడం లేదు. వాస్తవ లోకంలో సత్యాన్వేషణలో ఉన్నారు.

అది సంతోషం. ప్రపంచ బ్యాంకు పేదరికానికి ఒక రేఖ గీసింది. గతంలో ఒక వ్యక్తి పేదరికం నుంచి బయట పడాడని నిర్ధారించడానికి ఒక కనిష్ట వినియోగ వ్యయాన్ని నిర్ణయించింది. 2.15 డాలర్లు. అయితే దానిని ఇప్పుడు మూడు డాలర్లుగా పెంచింది. అట్లా పెంచినా కూడా పేదరికం రేటు కూడా బాగా తగ్గింది. 2011 12 లో 16.2 ఉంటే, 202223 నుండి 2.3 శాతానికి తగ్గింది. జనాభాలో తగ్గింది, రేటులో కూడా తగ్గింది. దీనిని కళ్లు, చెవులున్న ఎవరైనా నమ్మే స్థితిలో ఉండకూడదు. అయితే దీని నిజానిజాలు చూద్దాం. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఒక మనిషి మూడు డాలర్లు రోజుకు వినియోగం చేయాలి. అంటే ఒక కుటుంబంలో కనీసం నలుగురు ఉంటే ఆ కుటుంబ వ్యయం రోజుకు పన్నెండు డాలర్లు ఉండాలి. అంటే మన దేశ కరెన్సీలో ఈ రోజు లెక్కల ప్రకారం డాలరుకు 86.06 రూపాయలు. నలుగురికి కలిపి 344.24 అంటే 344 రూపాయలు ఒక కుటుంబానికి ఆదాయం ఉండాలి. ఖర్చు చేయాలి. నెలకు 10,327 రూపాయలు.

సంవత్సరానికి 1,23,924 రూపాయలు ఆదాయం, ఖర్చుగాని ఉండాలి. ఇక్కడ రెండు విషయాలు, ఒక కుటుంబం పది వేల రూపాయలతో ఒక నెల జీవితాన్ని కొనసాగించగలదు. ప్రపంచ బ్యాంకు స్వయంగా ఇంతలో దుస్తులు, తిండి, ఇల్లు, వైద్యం, విద్య, ప్రయాణాలు, యాత్రలు అన్ని కలిసి ఉంటాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధరలతో ఒక కుటుంబం అంటే నలుగురు సభ్యులు ప్రతి నెలా పది వేల రూపాయలతో ప్రపంచ బ్యాంకు పేర్కొన్న అన్ని వసతులను పొందగలుగుతారా? కనీసం జ్ఞానమున్న ఎవరైనా దీనిని నమ్మే స్థితిలో లేరు. అంటే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం పదిహేడు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. మన కళ్ల ముందు మన వాడలో, మన ఊళ్లో ముఖ్యంగా పేదల వాడల్లో ఎంత మంది ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం మంచి జీవితంలోకి వచ్చారు? పేదరికం నుంచి పేదలు బయటపడకపోగా మరింత మంది మధ్య తరగతి వర్గాలు పేదరికం అంచుల్లోకి వెళ్లాయి, వెళ్తున్నాయి.

ప్రపంచ బ్యాంకు నిర్ధారించిన కనీస ఆదాయం, ఖర్చు ఈ రోజు చాలా మందికి లేదు. “2022 వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ రిపోర్టు” ప్రకారం ఒక శాతం జనాభా కలిగిన అపర కోటీశ్వరులు 22 శాతం జాతీయ ఆదాయాన్ని కలిగి ఉన్నారు. వీళ్లతో కలిపి 10 శాతం మంది సంపన్నులు 57 శాతం జాతీయ ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. మిగతా తొంబయి శాతం మందిలో 40 శాతం మంది ప్రతి సంవత్సరం 1.65 లక్షల ఆదాయం కలిగి ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది కేవలం 71,163 రూపాయలు ఆదాయం కలిగి ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసినా మన దేశంలో యాభై శాతం మంది పేదరికంలో ఉన్నట్లు గుర్తించాలి. దీనికి ఎవ్వరు సమాధానం చెప్పాలి. అదే సమయంలో ప్రపంచంలోని చాలా ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు ఎన్నో మానవాభివృద్ధి విషయాల మీద అధ్యయనాలు, సర్వేలు చేస్తున్నాయి. అందులో కొన్నింటిని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. పేదరికానికి నేరుగా సరిపోయే సర్వే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఆకలి సూచిక నివేదికలో భారతదేశం స్థానం 2024 సంవత్సరం ప్రకారం 105వ స్థానం. సర్వే చేసిన మొత్తం దేశాల సంఖ్య 127 మాత్రమే.

127 దేశాల్లో భారత దేశం చివరినుంచి దగ్గరలో ఉంది. ఒకవేళ గత పదిహేను సంవత్సరాల్లో పేదరికం తగ్గిపోయి ఉంటే ఆకలి సూచిక కూడా తగ్గాలి. కానీ అది తగ్గలేదు. దీనిని ‘కన్‌పర్న్ వరల్డ్ వైడ్‌” అనే సంస్థ ప్రతి సంవత్సరం తన నివేదికలను విడుదల చేస్తున్నది. మరో నివేదిక “మానవాభివృద్ధి సూచిక”. ప్రపంచ మానవాభివృద్ధి నివేదికను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యుఎన్‌ఒ) విభాగమైన ‘యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యున్‌డిపి) నిర్వహిస్తున్నది. ఇందులో 2025 నివేదిక ప్రకారం భారతదేశ స్థానం 130. సర్వే చేసిన దేశాలు 193. అంటే ఇందులో కూడా మన ప్రగతి ఎక్కడ ఉందో మనం చూశాం. దీని ప్రకారం చూసినా మనం మానవాభివృద్ధిలో అట్టడుగున ఉన్నాం. అత్యంత ముఖ్యమైన మరో నివేదిక వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్. ఇందులో 147 దేశాలలో అధ్యయనం జరగగా, మన స్థానం 118 మాత్రమే. ఇందులో మానవాభివృద్ధితోపాటు ఇంకా మానసిక, ప్రకృతిపరమైన రక్షణ అంశాలు కూడా ఉంటాయి.

ఇందులో మనం వందకు పైగా స్థానంలోనే ఉన్నాం. ఇందులో కుటుంబ తలసరి ఆదాయం, జీవనంలో మెరుగుదల, ఆరోగ్యకరమైన జీవితం, తనకు నచ్చిన విషయాలను ఎన్నుకొని ఆచరించే స్వేచ్ఛ, నిజాయితీ కలిగిన జీవనం, అవినీతి నుంచి విముక్తి లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఈ రోజు మానవాభివృద్దికి ఒక ప్రామాణికంగా నిలుస్తున్నది. ఇవి ప్రపంచ గమనాన్ని సూచిస్తున్న కొన్ని నివేదికలు మాత్రమే. అయితే భారతదేశంలోని ప్రజలకు సంబంధించిన కొన్ని లెక్కలు మన ప్రభుత్వమే సేకరించి ప్రకటించింది. అందులో పేదరికంతో ముడిపడి ఉన్న కొన్ని నివేదికలు చూద్దాం. అందులో పౌష్టికాహారం, రక్తహీనత, శిశు, మాతా మరణాలకు సంబంధించినవి. ఇందులో ముఖ్యంగా పౌష్టికాహారానికి సంబంధించి చూస్తే ముందుగా దాని ఫలితం మనిషి రక్తంలో కనిపిస్తున్నది. కనీస మంచి ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రక్తహీనత ఉండదు. కానీ మన దేశంలో మహిళల్లో 57 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. పిల్లలతో కలిపి ఇది 67 శాతానికి పెరుగుతున్నది.

దీనికి మరొక విషయాన్ని జోడిస్తే మనకు విషయం అర్థం కాగలదు. ఎనీమియాఅంటే రక్తహీనత ఈ స్థాయిలో ఉంది కాబట్టే, కేంద్ర ప్రభుత్వం ‘ఎనీమియా ముక్తి భారత్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. మన దేశంలో చాలా కాలంగా పేదలకు సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు ప్రత్యేకించి బియ్యం, గోధుమలు ఇస్తున్నారు. దీనికి పేదరికం ప్రామాణికం. దీని ప్రకారం 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ పొందుతున్నారు. దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే, దానిలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందున ఉచిత రేషన్ పొందుతున్నారు. దాదాపు 75 శాతం మంది ఉచిత రేషన్ పొందుతున్నారు. అంటే వీళ్లందరూ పేదలనే కదా మనం ఉచిత రేషన్ ఇస్తున్నారు. ఒక వైపు 75 శాతం జనాభా పేదరికంలో ఉన్నారని ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తూనే, రెండో వైపు 5 శాతం మాత్రమే పేదలు ఉన్నారని ప్రపంచ బ్యాంకు ప్రకటించగానే దానిని తమ విజయంగా ప్రకటించి హర్షించడం ఎంత వరకు సబబు.

దీనినే మనం మాయా ప్రపంచం అనక తప్పదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వం వేరు వేరుగా ఈ లెక్కలు చేయలేదని మనం గమనించాలి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అవమానం, అణచివేత, వివక్ష ఇంకా ఈ దేశాన్ని వదలి వెళ్లలేదు. ఇంకా రోజురోజుకూ వాటి తీవ్రత పెరుగుతున్నది. అయితే అవి కనిపించకుండా, వినిపించకుండా ఉండడానికి ఆకలిని తగ్గించడానికి అరకొర ధాన్యం సహాయాలు అందిస్తూ ఎటువంటి ఆలోచనలు రాకుండా మతం, కులం చర్చలు చేస్తూ సమయాన్ని వెళ్లదీస్తున్నారు. మనిషి తాను ఎవరో, తాను ఏమిటో, తన స్థానమెక్కడో తెలుసుకొనే వరకే ఈ రంగులు నిలబడతాయి. ఆ తర్వాత అవే వాటంతట అవే తొలగిపోతాయి. మనిషి ఏనాటికైనా సత్యాన్ని తెలుసుకోవాలి. అంతవరకు వేచి ఉండాలి.

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News