బాల్యంలో సైకిల్ను అబ్బురంగా చూసి, మురిసి, నడిపించే ప్రయత్నాలు చేసి, అనుబంధాన్ని పెంచుకొని, గాయాలు చేసుకొన్న గుర్తులు ఎన్నెన్నో. సామాన్యుడి పుష్పక విమానం, పేదోడి రవాణా ద్విచక్ర వాహనం సైకిల్ లేదా బైసికిల్. అందరికీ అందుబాటు ధరల్లో లభించే ఘన చరిత్ర సైకిల్ది. చూడడానికి సరళంగా కనిపిస్తూ, యజమాని ఆరోగ్యాన్ని కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు గొడుగులు పడుతూ, సంతోషాల విందులు వడ్డిస్తూ, ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ, పరిశుద్ధ గాలిని అందిస్తూ, హరిత అభివృద్ధికి దోహదపడుతూ, సాహస క్రీడలకు ఉపకరిస్తూ మనకుటుంబాలతో అమూల్య బంధాలను పెనవేసుకున్నది మనం అమితంగా ప్రేమించే సైకిల్. మానవాళికి పలురకాల అమూల్య సేవలను అందిస్తున్న సైకిల్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐరాస 2018లో తీసుకున్న తీర్మానం ప్రకారం ఏటా 03 జూన్ రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం లేదా వరల్డ్ బైసికిల్ డే పాటించడం ఆనవాయితీగా మారింది.
శిలాజ ఇంధనాలను వినియోగించే మోటారు సైకిల్ లేదా బైక్, కారు, బస్సు లాంటి వాహనాల వినియోగం పెరగడంతో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాల పెరిగి భూతాపం లాంటి పలు విపత్తులకు దారి తీస్తున్న వేళ, మనకు ఆరోగ్య ప్రదాయిగానే కాకుండా పర్యావరణ హితం కోసం ఉపయోగపడుతున్న సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడం, ఇతర వాహనాల వినియోగాన్ని తగ్గించడం, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడడం, రేపటి తరానికి సైకిల్ ఉపయోగాలను వివరించడం లాంటి లక్ష్యాలను ప్రపంచ సైకిల్ దినోత్సవం (Bicycle Day) వేదికలు దోహదపడుతున్నాయి. 2025 ప్రపంచ సైకిల్ దినం ఇతివృత్తంగా ఆరోగ్యం, సమానత్వం, సుస్థిరాభివృద్ధికి సైకిల్ వినియోగం అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహించడం జరుగుతోంది.
1817లో ‘కార్ల్ వాన్ డ్రైస్’ అనే వ్యక్తి సైకిల్ను కనుగొని, దానికి ‘దండీ హార్స్’ లేదా లవుఫ్మెషిన్ లేదా స్విఫ్ట్వాకర్ అని నామకరణం చేశాడు. 1880ల్లో బ్రిటీష్ పాలకుల సరదా వాహనంగా భారత్లోకి ప్రవేశించిన సైకిల్, అనతి కాలంలోనే ప్రజాదరణ పొందడం, 1900 ల్లో మధ్య తరగతి/ అధిక ఆదాయ వర్గాల మన్ననలు పొందింది. 1923లో ముంబాయ్లోని యువకులు సాహసోపేతంగా 70,000 కి.మీ సైకిల్ యాత్రను 5 ఏండ్ల పాటు నిర్వహించి ప్రపంచ పర్యాటన చేయడంతో ప్రజల దృష్టి సైకిల్పై పడింది.1930ల్లో భారత ప్రభుత్వం సైక్లింగ్ను క్రీడగా భారత సైక్లింగ్ ఫెడరేషన్ వేదిక గుర్తించింది.
1950 ల్లో భారత్లో అట్లాస్ సైకిల్స్ తయారీ పరిశ్రమ నెలకొల్పారు. నేడు అన్ని వర్గాల, వయస్సుల వారితో సైకిల్ ఒక విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుంది. డిజిటల్ యువతలోనే కాదు, తల్లిదండ్రుల్లో కూడా సైకిల్ పట్ల కొంత నిరాదరణ నెలకొని ఉంది. మోటారు వాహనాల వరదలో సైకిల్ కొట్టుకుపోతున్నది. సైకిల్ చైయిన్ తెగిపోతున్నది. సైకిల్పై తల్లిదండ్రులకే ప్రేమ సన్నగిల్లుతున్న వేళ నేటి పిల్లలు, యువత కూడా సైక్లింగ్పట్ల ఆసక్తి చూపడం లేదు. మన ఆరోగ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఉపకరిస్తున్న సైకిల్కు పూర్వ వైభవం తేవడానికి నేటి పెద్దలు పూనుకోవాలి. రేపటి ఆరోగ్యకర సమాజ స్థాపనకు విత్తులు నాటాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, 99497 00037
( నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం)