భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సర్కిల్ ఇన్స్స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వుల్లో వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన పెండ్లి శ్రీరామ్రెడ్డి,భార్య పెండ్లి పద్మజ రెడ్డి, కుమారుడు హరీష్ రెడ్డిలపై వారి కోడలు ఫిర్యాదుకు సంబంధించి సిఐ సత్యనారాయణ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో కుటుంబ మెత్తాన్ని చట్ట విరుద్దంగా 8 నుంచి 12 గంటల పాటు పోలీస్ స్టేషన్లో సిఐ నిర్భందించారని తెలిపారు.
దీంతో పాటుగా బెదిరించడం, ఆహారం ఇవ్వకుండా, కనీస ప్రాథమిక సౌకర్యాలు నిరాకరించి ఎవరితో మాట్లాడవద్దని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పద్మజ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై పెండ్లి శ్రీరామ్ రెడ్డి ఈనెల 19వ తేదీన ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయంలో ఇన్స్పెక్టర్ ప్రవర్తన సరిగా లేదని, చట్టవిరుద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సిఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.