జిల్లా కేంద్రంలో శనివారం రూ. 15,000 లంచం తీసుకుంటూ ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు వెంకటాపూర్ గ్రామ శివారులో గల 476 ఈ/సిలోని 6 గుంటల భూమి సర్వే కోసం నాలుగు మాసాల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ భూమి కొలతల పంచనామా ధృవీకరణ పత్రం ఇవ్వడం కోసం సర్వేయర్ నాగరాజు రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు.
తమ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా బాధిత రైతు ఇప్పటికే రూ.22,000 సర్వేయర్కు అందించాడు. అయితే, మిగతా డబ్బుకోసం రోజూ ఇబ్బంది పెడుతుండటంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట రైతు వేదిక వద్ద సర్వేయర్కు మరో రూ.15,000 లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సర్వేయర్పై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేటకు తరలించి, విచారించిన తర్వాత కరీంనగర్ ప్రత్యేక ఎసిబి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.