ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా, అర్వపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఆన్లైన్ యాప్లో డబ్బులు డ్రా చేసి, వాడుకొన్న తర్వాత ప్రతినెలా వడ్డీతో సహా అసలు చెల్లించే విషయంలో జాప్యం కావడంతో లోన్ యాప్ అధికారుల వేధింపులతో జాజిరెడ్డిగూడెం మండలంలో సుకుమార్ రాజు (28) ఆత్మహత్య చేసుకున్నాడు. అర్వపల్లి స్టేషన్ హౌస్ అధికారి బి. రాంకోటి , మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం బొల్లంపల్లి గ్రామానికి చెందిన వంగాల సత్తయ్య చిన్న కుమారుడు సుకుమార్ రాజు గతంలో బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినపుడు ప్రైవేటు లోన్యాప్ ద్వారా ఎస్బిఎఫ్సి ఫైనాన్స్తో పాటు స్లైస్, పేటియం మరికొన్ని మనీ లోన్ యాప్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రతినెలా కట్టేవాడు.
అయితే, బెంగుళూరులో ఉద్యోగం మానేసి ఉద్యోగం కోసం హైదరాబాద్లో అన్వేషిస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల క్రితం బొల్లంపల్లి గ్రామంలో శివాలయం పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. అప్పటి నుంచి ప్రతి నెల డబ్బులు కట్టకపోవడంతో ఆయా లోన్ యాప్ల నిర్వాహకులు వేధింపులు భరించలేక బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబీకులు లేచి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల్లో విషాధచాయలు అలుముకున్నాయి. తండ్రి వంగాల సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.