న్యూఢిల్లీ: పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. భారత్లో అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్ఐ’ ఆమెను వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్ఐ హ్యాండ్లర్ల్లతో ఆమె తో కోడ్ భాషలో మాట్లాడినట్టు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్తో జ్యోతి మల్హోత్రా వా ట్సాప్లో చాటింగ్ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. భారత అండర్కవర్ ఆపరేషన్స్ గురించి వీరిద్దరూ కోడ్ భాషలో మాట్లాడుకున్నారట. ఒక మెసేజ్లో అటారీ సరిహద్దు వద్ద ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించావా? అని హసన్ ఆమెను అడిగినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. వీరి చాటింగ్లో‘ ప్రోటోకాల్ , అండర్కవర్ ’ అనే పదాలను బట్టి , భారత నిఘా సమాచారాన్ని దొంగిలించేందుకు జ్యోతిని పాక్ ఐఎస్ఐ వినియోగించుకున్నట్టు అర్థమవుతోంది.
జ్యోతిహసన్ మధ్య సంభాషణ జరిగిందిలా …
హసన్ : నువ్వు అటారీ వద్ద ఉన్నప్పుడు ఎవరికైనా ప్రత్యేక ప్రోటోకాల్ దక్కిందా?
జ్యోతి : లేదు.. ఎవరికీ అలాంటి ప్రోటోకాల్ కనిపించలేదు.
హసన్ : ఎవరు ప్రోటోకాల్ పొందుతున్నారో గమనించు… అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు అదే సరైన మార్గం.
జ్యోతి : వారంత తెలివితక్కువ వాళ్లేం కాదు.
కోడ్ భాషలో ఉన్న సందేశాన్ని ఎన్క్రిప్ట్ చేసిన తరువాత వీరి మధ్య సంభాషణను దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి ఇవ్వాలనుకుంటోందా ? లేకపోతే ఆమెను ఎవరైనా మభ్యపెట్టి గూఢచర్యం కోసం వినియోగించుకుంటున్నారా ?అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
2023లో వైశాఖి ఫెస్టివల్ కోసం జ్యోతి తొలిసారి పాకిస్థాన్కు వెళ్లింది. అక్కడే ఆమెకు పాక్ హైకమిషన్ అధికారి డానిష్తో పరిచయం ఏర్పడింది. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని తొలుత జ్యోతి బుకాయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెను ఎన్ఐఏ , ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ ) అధికారులు ప్రశ్నిస్తున్నారు.