తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఆమె చెప్పారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు.. సుప్రీం ఆదేశాల మేరకు భారత్ కు వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు ఆయనను మూడుసార్లు విచారించిన అధికారులు.. ఈ కేసులో దూకుడు పెంచారు. మరోసారి ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు వంటి వారిని మళ్లీ విచారిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మీల ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమేనని చెప్పారు. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా… ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమే. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. ఫోన్ ట్యాపింగ్పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు విచారణ వేగవంతం చేయాలి. తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్, జగన్ సంబంధం ముందు.. రక్తసంబంధం కూడా చిన్నబోయింది” అని షర్మిల పేర్కొన్నారు.