Thursday, May 15, 2025

కోల్‌కతా హోటల్‌లో అగ్ని ప్రమాదం..14 మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా లోని బుర్ధా బజార్ లోని మెచ్చుపట్టి ఏరియాలోని రుతురాజ్ హోటల్‌లో మంగళవారం రాత్రి 8.15 గంటలకు సంభవించిన అగ్నిప్రమాదంలో 14 మంది సజీవదహనమయ్యారు. వీరిలో 11 మంది పురుషులు. కమ్ముకున్న పొగకు ఊపిరాడక పోవడం వల్లనే చాలామంది మృతి చెందారని కోల్‌కతా సిపీ మనోజ్‌కుమార్ వర్మ ప్రకటించారు. మంటలకు మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మొదట మంటలు లేచాయి. వేగంగా నాలుగు అంతస్తుల భవనాన్ని కమ్ముకున్నాయి. మృతుల్లో ఎనిమిది మందిని ఇంతవరకు గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు బాలుడు, బాలిక ఉన్నారు. హోటల్‌లో ఉన్న పలువురు ప్రాణాలను రక్షించుకోడానికి హోటల్ కిటికీలను పగులగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు.

మరికొంతమంది బయటపడే దారి లేక అలాగే గదుల్లో ఉండిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారు ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుందని , ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. పది అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. నిచ్చెనల సాయంతో కొంతమందిని కిందికి తీసుకు వచ్చారు. 10 గంటల పాటు మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించవలసి వచ్చింది. బుధవారం ఉదయానికి మంటలు అదుపు లోకి వచ్చాయి. తక్కువ ఛార్జితో లాడ్జింగ్ సౌకర్యం లభించే రితురాజ్ హోటల్‌లో ప్రమాద సమయంలో 42 గదుల్లో 88 మంది అతిధులు ఉన్నారని చాలా మంది బయటకు రాలేక గదుల్లోనే ఉండిపోయారని సీనియర్ అధికారి చెప్పారు.

మృతుల కుటుంబాలకు కేంద్రం, రాష్ట్రం చెరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంలో మృతులైన 14 మంది కుటుంబాలకు కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు చెరో రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేయనున్నట్టు తెలియజేశాయి. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు ప్రధాని కార్యాలయం వివరించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సంతాపం ..
ఈ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వెల్లడించారు. హోటల్ భవనంలో ఈ ఘోరప్రమాదం జరగడం ఆందోళన కలిగించడమే కాక, బాధాకరమని రాష్ట్రపతి తన ఎక్స్ పోస్టు ద్వారా సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రాత్రంతా సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ : సిఎం మమతా బెనర్జీ
ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు.రాత్రంతా ఈ ప్రమాదంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. హోటల్ గదుల్లో మండే సామాన్లు భద్రపరచి ఉంచడంతో మంటలు వేగంగా వ్యాపించాయని ఆరోపించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా , గాయపడిన వారికి రూ. 50 వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం స్పెషల్‌ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. ప్రమాదం నుంచి దాదాపు 99 మందిని రక్షించినందుకు ఫైర్‌సర్వీస్‌ను, పోలీస్ యంత్రాంగాన్ని ప్రశంసించారు. సహాయ కార్యక్రమాల్లో స్థానికులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ విమర్శ
నిన్న బుర్రాబజార్ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించగా, ఆ సమయంలోముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిఘాలో జగన్నాథ థామ్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారని కేంద్ర మంత్రి , రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శించారు. నిస్సహాయులై బాధితులు మంటల్లో చిక్కుకుని ఉంటుండగా, ముఖ్యమంత్రి తన మతపరమైన కార్యక్రమంలో నిమగ్నమయ్యారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి రాష్ట్ర అధికార యంత్రాంగం వైఫల్యాన్ని తెలియజేస్తుందని ఆక్షేపించారు. రాష్ట్రం లోని బీజేపీ కార్యకర్తలు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా సహాయపడాలని పిలుపునిచ్చారు.

టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సంతాపం
టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర అధికార యంత్రాంగం, వివిధ సంస్థల వాలంటీర్లు, బాధితులకు అన్ని విధాలా సహాయపడేందుకు , పునరావాసం కల్పించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కష్టసమయంలో బాధితులకు అండగా మనమంతా నిలబడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News