Friday, April 26, 2024

బండెనక బండి కట్టి 150 బండ్లు కట్టి

- Advertisement -
- Advertisement -
  • మూగ జీవుల ఆకలి తీర్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
  • తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా గోశాలలకు పశుగ్రాస వితరణ
  • గత ఐదేళ్ళ నుంచి గోశాలలకు వితరణ
  • సత్తుపల్లి సెగ్మెంట్ నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు
  • ఖమ్మంలోని 11 గోశాలలకు 150 ట్రాక్టర్ల పశుగ్రాసం వితరణ
  • ట్రాక్టర్ నడిపి ప్రారంభించిన ఎంపి వద్దిరాజు, ఎమ్మెల్యే సండ్ర

ఖమ్మం : బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె వస్తవ్ కొడుకో అనే చందంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని అనేక గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 150 వరి గడ్డ ట్రాక్టర్లు ఖమ్మం నగరంలోని 11 గోశాలలోని వందలాది గోవులకు గ్రాసం వితరణ చేసిన దృశ్యాలు చూపరులను అకట్టుకున్నాయి. టిటిడి ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పనిచేసిన ఎమ్మెల్యే సండ్ర గత ఐదేళ్ళ నుంచి తన నియోజకవర్గం నుంచి పశుగ్రాసాన్ని తీసుకొచ్చి గోశాలకు వితరణ చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఖమ్మం నగరంలోని 11 గోశాలలలోని వందలాది మూగజీవులకు 150 ట్రాక్టర్లతో పశు గ్రాసాన్ని ఖమ్మం నగరానికి తీసుకొచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన రైతులంతా మండుటెండను సైతం లెక్కచేయకుండా దాదాపు 120 కిలోమీటర్ల దూరం నుండి ఖమ్మంకు 150 ట్రాక్టర్ల ట్రక్కుల పశుగ్రాసాన్ని స్వచ్ఛందంగా తీసుకొచ్చి వితరణ చేశారు.

ఈ సందర్బంగా ఖమ్మం నగరంలో టేకులపల్లి బ్రిడ్జి వద్ద రహదారిపై బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఈ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఎంపి వద్దిరాజు స్వయంగా పశు గ్రాసం ఉన్న ట్రాక్టర్ ను నడిపి టేకులపల్లి గోశాలకు తరలించారు. అనంతరం స్వయంగా గోవులకు పశుగ్రాసం వేసి పూజించి అక్కడ ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయల అర్చకులు వేధ పండితుల ఆశీర్వచనంతో ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య దంపతులు గోపూజ నిర్వహించి పశుగ్రాసాన్ని వితరణ చేశారు.

  • ఆవులను మన దేశం పవిత్రంగా పూజిస్తుంది : ఎంపి రవిచంద్ర

మన దేశంలో ఆవులను పవిత్రంగా చూడడమే కాక పూజిస్తామని, శుభకార్యాల సందర్భంగా వాటికి ప్రత్యేక స్థానం ఉంటుందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం నగరం ఖానాపురం టేకులపల్లిలో నెలకొన్న సుప్రసన్న శ్రీ వేంకటేశ్వర గోశాలకు పశుగ్రాసాన్ని అందజేశారు. ఎమ్మెల్యే సండ్ర తన సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన పశుగ్రాసాన్ని 150 ట్రాక్టర్స్ ద్వారా ఈ గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎంపి రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటవీరయ్య వెంట రాగా మండుటెండలో మెయిన్ రోడ్ నుంచి గోశాల వరకు 2కిలోమీటర్లు ట్రాక్టర్ ను నడిపించారు.

ఎంపి వద్దిరాజు మాట్లాడుతూ అన్నదానం మాదిరిగానే మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించడమనేది కూడా ఒక పుణ్య కార్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయన సండ్రతో కలిసి గోశాల చెంతనే ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపి వద్దిరాజు తమ కుటుంబ గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి, వేదపండితులు,గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు ఆశీర్వచనాలు పలికి అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంకటవీరయ్యతో కలిసి ఎంపీ రవిచంద్ర గోశాల అంతటా తిరిగి ఆవులకు అరటి పండ్లు తినిపించారు.

  • గో సేవ ఎంతో పుణ్యకార్యం : ఎమ్మెల్యే సండ్ర

సృష్టిలోని సకల జీవరాసులన్నింటి పట్ల కారుణ్య భావన ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని, ‘గోవు’ అనగానే భారతీయులలో పవిత్రభావం కలుగుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. భారతీయ సంస్కృతిలో గోమాతను దేవతగా భావిస్తారని, గో సేవ ఎంతో గొప్ప కార్యక్రమమని వాటికి సేవ చేసుకునే భాగ్యం పశుగ్రాస వితరణతో కలగడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు. గోవు మన వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఆధారమని, సృష్టిలో జీవించే హక్కు మానవులతో పాటు సకల జీవరాశులకూ ఉంటుందన్నారు. వ్యవసాయభివృద్ధి జరగాలంటే పశువులుంటేనే సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా గోశాలలకు గడ్డిని వితరణగా అందజేసినట్లు తెలిపారు.

నోరు ఉండి మాట్లాడగలిగే ప్రతి జీవికి ఏదో రకంగా సహాయం అందుతున్న తరుణంలో నోరులేని మూగజీవాలకు సహాయం అందించాలనే సంకల్పంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సహకారంతో ఐదు ఏళ్ల నుండి గోశాలలకు పశుగ్రాసాన్ని వితరణ చేస్తున్నామని అన్నారు. రైతుల జీవితంతో ముడిపడి ఉన్న గోసంపదని రక్షించాలి, గోవును పూజించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల సహాయం అందిస్తే, నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో, గోవులకు సహాయం అందించాలని ఆ రోజుల్లో పిలుపునిస్తే వందల సంఖ్యలో పశుగ్రాసం దొరకని సమయంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో భద్రాచలం గోశాలలకు పశుగ్రాసాన్ని అందించామన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా గోశాలకు పశుగ్రాసాన్ని అందించి చేయూతని ఇచ్చామన్నారు. నానాటికీ తరిగిపోతున్న గోమాత విశిష్టత నేటి యువతరానికి తెలియదన్నారు. మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

టిటిడి పాలకమండలి సభ్యులుగా నాడు టేకులపల్లి గోశాలకు 30 లక్షల రూపాయలతో గోశాల భవనాన్ని నిర్మించి గోసేవ పై మక్కువ చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, రేడ్డం వీరమోహన్ రెడ్డి, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, ఎంపీపీలు దొడ్డ శ్రీనివాసరావు, బీరవల్లి రఘు, నాయకులు దుగ్గిదేవర వెంకట్ లాల్, మందలపు అశోక్, భూక్య ప్రసాదు, తావు నాయక్, చింతల సురేందర్ రెడ్డి, కాలినేని వెంకటేశ్వరావు, తుంబూరు దామోదర్ రెడ్డి, వాసిరెడ్డి, పాలకుర్తి రాజు, గాయం రాంబాబు, పసుమర్తి చంద్రరావు, మట్టా ప్రసాదు, కొప్పుల అప్పారావు, పెడకంటి రామకృష్ణ, తుంబూరు కృష్ణారెడ్డి, ఏగోటి పెద్దిరాజు , మట్టా ప్రసాదు, కాటమనేని వెంకటేశ్వరరావు, కొండపల్లి రమేష్ రెడ్డి, మోదుగు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News