భారత్, పాకిస్థాన్లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను మంగళవారం పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 246 మంది పేర్లను వెల్లడించింది. వారిలో 53 మంది పౌర ఖైదీలు, 193 మంది మత్సకారులు ఉన్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్కు పాక్ ప్రభుత్వం ఈ వివరాలు అందించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. వారిని త్వరగా విడుదల చేసి స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఈ సందర్భంగా పాక్ను కోరింది.
అదే సమయంలో భారత్ కూడా తమ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల వివరాలున్న జాబితాను ఢిల్లీ లోని పాక్ హైకమిషన్కు అందించింది. మన అదుపులో పాక్ జాతీయులు, పాక్జాతీయులుగా పరిగణిస్తోన్న వారు 463 మంది ఉన్నారు. అందులో 382 మంది పౌర ఖైదీలు కాగా, 81 మంది జాలర్లు. 2008లో చేసుకున్న ఒప్పందం ప్రకారం… ఇరు దేశాలు ఏటా రెండుసార్లు (జనవరి 1, జులై 1) దౌత్యమార్గాల ద్వారా ఈ వివరాలను పరస్పరం పంచుకుంటాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్ పాక్ మధ్య ఖైదీల గుర్తింపు, విడుదల ప్రక్రియ వేగవంతం అయింది.