Tuesday, April 30, 2024

ముగ్గురు భారత వుషు క్రీడాకారులకు వీసా నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఆరంభానికి ముందే ఆతిథ్య చైనాభారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా ప్రభుత్వం వీసాను నిరాకరించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వుషు అథ్లెట్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చైనా ప్రభుత్వం అడ్డుకుంది. ఇక చైనా వెఖరీని నిరసిస్తూ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరింధమ్ బాగ్చి శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వుషు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులను ఆతిథ్య దేశం చైనా వీసాను నిరాకరించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

చైనా వైఖరీని తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆరంభ వేడుకలకు క్రీడల మంత్రిని పంపించ కూడదని నిర్ణయించింది. కాగా, శనివారం ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే జాతి ఆధారంగా తమ పౌరుల పట్ల చైనా వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. చైనా వైఖరీకి నిరసనగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు భారత అథ్లెట్లకు వీసా నిరాకరించడంపై ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతో పాటు బీజింగ్‌లో కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసినట్టు భారత ప్రభుత్వం తెలిపింది. కాగా, ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఫుట్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి అధికారికంగా క్రీడలను నిర్వహిస్తారు. అక్టోబర్ 8వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. భారత్‌తో సహా ఆసియాలోని దాదాపు అన్ని దేశాలు ఈ మినీ ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాయి. ఆరంభోత్సవ వేడుకలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News