Monday, April 29, 2024

శునకాల కోసం ఘర్షణ: కాల్పుల్లో ఇద్దరి మృతి(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇండోర్: పెంపుడు శునకాల విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ చివరకు ఇద్దరు వ్యక్తుల హత్యకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. మృతులను విమల్(35), రాహుల్ వర్మ(28)గా గుర్తించారు.

ఒక ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌పాల్ రజావత్ కిషన్‌బాగ్ కాలనీలో తన పెంపుడు శునకాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లగా పొరుగున నివసించే మరో వ్యక్తికి చెందిన పెంపుడు శునకంపైకి రజావత్ శునకం దూకింది. దీంతో రెండు శునకాల యజమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గొడవ ముదరడంతో రజావత్ తన ఇంట్లోకి వెళ్లిపోయి టెర్రస్ పై నుంచి రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి ఆ తర్వాత రోడ్డు మీద ఉన్న వారిపై పైనుంచే కాల్పులు జరిపాడు.

ఈ కాల్పులలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. రజావత్ నుంచి డబుల్ బ్యారెల్ 12 బోర్ గన్‌ను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News