Saturday, April 27, 2024

భారత వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం 48 బ్యాకప్ సైట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్లి మూడు రోజుల తరువాత తిరిగి భూమి మీదకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారు సురక్షితంగా ల్యాండింగ్ కావడానికి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా 48 బ్యాకప్ సైట్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. గగన్‌యాన్ యాత్రలో భాగంగా తమ ప్లాన్ ప్రకారం వ్యోమగాముల మాడ్యూల్ అరేబియా సముద్రంలో దిగాల్సి ఉందని, వారిని రక్షించడానికి అక్కడ సిబ్బంది సిద్ధంగా ఉంటారని ఇస్రో సీనియర్ అధికారిని ఉద్దేశిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రణాళికలో ఏ చిన్న మార్పుకైనా సిద్ధంగా ఉండే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఈమేరకు అంతర్జాతీయ జలాల్లో 48 బ్యాకప్ సైట్లను గుర్తించామని ఇస్రో సీనియర్ అధికారి చెప్పినట్టు మీడియా వివరించింది.

మిషన్‌లో చిన్నపాటి తేడా వచ్చినా వందల కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్‌కు కారణమవుతుందని ఇస్రో అధికారి చెప్పారు. ప్రస్తుతం గగన్‌యాన్ పనుల్లో పురోగతి ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది కనీసం ఒక్క మానవ రహిత యాత్ర అయినా నిర్వహించాలని లక్షంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా ఘనత దక్కించుకోనున్న ఈ బృందంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News