Thursday, June 19, 2025

అర్ధరాత్రి వృద్ధుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా, కందుకూరు పోలీస్టేషన్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పసుపుల చిన్న జంగయ్య ( 65) గొర్రెల కాపరిగా పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. గత కొన్ని రోజులుగా అతని కుమారుడు పసుపుల శేఖర్ (34) సెంట్రింగ్ పనిచేస్తూ ఇటీవల కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు పూర్తికావడానికి మరిన్ని డబ్బులు అవసరం ఉండటంతో తన నాన్న పేరున ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తిచేస్తానని అనేకమార్లు ఒప్పించడంలో విఫలం కావడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా నిరాకరించారు.పసుపుల శేఖర్ తన భార్య, పిల్లలతో ఊర్లోనే మరొకరి ఇంట్లో అద్దెకు ఉండగా, అతని తల్లి, తండ్రి నిర్మాణంలో ఉన్న స్లాబ్ కింద ఉండేవారు.

కాగా, మంగళవారం రాత్రి రోజూ మాదిరిగానే ఇంట్లో భోజనం చేసిన అనంతరం తల్లి పద్మమ్మ తన రెండవ కూతురు ఇంటి వద్దకు వెళ్లి పడుకోగా, తండ్రి జంగయ్య స్లాబ్ కింద పడుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున పద్మమ్మ తన భర్తను నిద్రలేపడానికి వెళ్లి దుప్పటితీయగా తలకు తీవ్రమైన గాయాలతో రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో ఆమె బోరున విలపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు. ఇదిలావుండగా, ఇటీవల భూమి అమ్మకం విషయంలో జరిగిన గొడవలతో తన భర్తను తమ కుమారుడు శేఖర్ హత్య చేసి ఉంటాడని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సీతారాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News