నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఇటీవలే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందం బుధవారం మరో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే..నల్గొండ జిల్లా, పర్వేదుల గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వయసు మహిళ గత రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి వైద్యం నిమిత్తం వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె కడుపులో కణతి ఉన్న ట్లు గుర్తించారు. మహిళ కుటుంబ సభ్యుల సమ్మతితో బుధవారం ఆపరేషన్ చేసి సుమారు 6 కిలోల బరువున్న కణతిని తొలగించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో సర్జన్ల బృందం డాక్టర్ శ్రీకాంత్ వర్మ, డాక్టర్ నిఖిత ,
డాక్టర్ వంశీ, డాక్టర్ దివ్య, అనస్తీషియా బృందం డాక్టర్ బద్రి నారాయణ , డాక్టర్ నవీన్, డాక్టర్ సుధా, డాక్టర్ గిరి, డాక్టర్ శ్వేత సుమారు నాలుగైదు గంటల పాటు శ్రమించి ఈ కణతిని తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యంత అదునాతన వైద్య పరికరాలు , వైద్య సదుపాయాలు, డాక్టర్లు ఉన్నందున ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగలుగుతున్నామని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన డాక్టర్ల బృందాన్ని ఆమె అభినందించారు.