సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు 8 మంది జిల్లా పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయారు. జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. ములుగు జిల్లా పోలీసులు, 39 సిఆర్పిఎఫ్ బెటాలియన్ పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని నక్సలిజాన్ని విడనాడి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయారని అన్నారు. ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు దొర్పెట్టి మిర్గు అలియాస్ లింగ అలియాస్ శివలాల్, 2 ఏరియా కమిటీ సభ్యులు మడవి టిడో అలియాస్ రామె, మిడియం భీమా, 3 పార్టీ సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేష్, సోయం భీమ, 2 మిలీషియా సభ్యులు మడవి మడక అలియాస్ గుడ్డు,
మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ మొత్తం 8 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వ పునరావాసం ద్వారా తక్షణ సహాయం ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేసినట్లు తెలిపారు. 2025 జనవరి నుండి రాష్ట్రంలో ఇప్పటివరకు 355 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ములుగు జిల్లా నుండి 68 మంది మావోయిస్టు దళ సభ్యులు 3 డివిసిఎం, 8 మంది ఏసిఎం, 19 మంది పార్టీ సభ్యులు, ఆర్పీసి, సిఎన్ఎం, డిఏకెఎంఎస్లలో పనిచేసిన 38 మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పునరావాసం సౌకర్యాలను పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఎఎస్పి శివమ్ ఉపాధ్యాయ,39 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ విక్రంసింగ్ ఠాకూర్, ఇన్ఛార్జి ఒఎస్డి, ములుగు డిఎస్పి నలువాల రవిందర్, ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్బి సిఐ శంకర్, ఆర్ఐ తిరుపతి, ఏటూరునాగారం, వెంకటాపురం ఎస్ఐలు తాజోద్ధీన్, తిరుపతి రావు, సిబ్బంది పాల్గొన్నారు.