Saturday, May 4, 2024

మణిపూర్ మరోసారి భగ్గుమంది..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి భగ్గుమంది. తెగల మధ్య ఘర్షణల రాష్ట్రంలోని ఖమెనిలోక్ ప్రాంతంలోని కుకీ గ్రామంలో పరస్పరం జరిగిన దాడులలో కనీసం తొమ్మండుగురు చనిపోయినట్లు, 10 మంది గాయపడ్డట్లు అధికారులు బుధవారం తెలిపారు. మృతులలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం సాయుధులు గ్రామంలోకి దూసుకువచ్చి దారుణానికి పాల్పడ్డారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా, కంగ్‌పోకి జిల్లాల సరిహద్దుల వద్ద ఈ గ్రామం ఉంది. మైతీ ప్రాబల్యపు ఇంఫాల్ ఈస్ట్, గిరిజనం అత్యధికంగా ఉండే కంగ్‌పోకి జిల్లాల మధ్య ఈ గ్రామం ఉంది. నెలల తరబడి ఈ ప్రాంతంతో కుకీలు, మైతీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం పరస్పర కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన వారు మృతి చెందడం, గాయపడటం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన తరువాత జిల్లా అధికారులు కర్ఫూ సడలింపులను తీసివేశారు. ఇప్పుడు మణిపూర్‌లోని 16 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో కర్ఫూ అమలులో ఉంటుంది. ఈ రాష్ట్రంలో అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మణిపూర్‌లో రిజర్వేషన్ల కోటా అంశం నెలల తరబడిగా ఇక్కడి మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ వచ్చింది. సైనిక, పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొహరిచుకుని ఉన్నాయి. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ఠ్రంలో రెండు మూడు రోజులు మకాం వేసి , ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అక్రమాయుధాలు ఉన్న వారు వెంటనే వాటిని పోలీసు అధికారులకు అప్పగించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు వర్గాల మధ్య సమన్వయానికి పలు విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే ఆ తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో వర్గఘర్షణలతో 100 మందికి పైగా మృతి చెందారు. 310 మంది వరకూ గాయపడ్డారు. వేలాది మంది నిర్వాసితులయ్యి, సహాయక కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. మే 3వ తేదీన చేపట్టిన గిరిజన సంఘీభావ ప్రదర్శన తరువాత రాష్ట్రంలో చిచ్చు రగులుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News