Tuesday, April 30, 2024

జాబ్స్ జాతర

- Advertisement -
- Advertisement -

CM KCR announces 80039 govt jobs

80,039 కొలువులు
భారీ నియామక ప్రక్రియ ఒకేసారి ప్రారంభం
శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటన
ఉప్పొంగిన నిరుద్యోగ యువత
అటెండర్ నుంచి ఆర్‌డిఒ వరకు 95% స్థానికులకే
గరిష్ఠ వయోపరిమితి 10ఏళ్లు పెంపు
ఇక నుంచి ఏటా జాబ్ క్యాలండర్
భర్తీకి గ్రూప్‌లు, క్యాడర్లు జిల్లాలు, జోన్లు మల్టీజోన్లు తదితర కేటగిరీల వారీగా ఖాళీల ప్రకటన
తెలంగాణ పోరాట నినాదమే నీళ్ళు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి. తెలంగాణ అవసరాలకు తగినట్లుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371- డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం. కేంద్రం అనవసర తాత్సారం చేసింది. దీంతో నేనే స్వయంగా అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిగారిని, రాష్ట్రపతి గారిని కలిసి దీనికున్న ప్రాముఖ్యతను వివరించాను. దీని కోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. ఇది తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైన విజయం. శాసనసభలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సిఎం కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను సిఎం కెసిఆర్ స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలకు బుధవారం నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సిఎం తెలిపారు. అటెండర్ నుంచి ఆర్‌డిఒ వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కెసిఆర్ స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్ కోటాలో ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలలో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని సిఎం చెప్పారు. రాష్ట్రంలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కెసిఆర్ తెలిపారు.యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వల్ల ప్రభుత్వంపై ఏటా సుమారు రూ. 7 వేల కోట్ల అదనపు భారం రాష్ట్ర పడుతుందని,అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసి,ఏటా నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని,అత్యధిక వేతనాలు తీసుకునే ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారని సిఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరితో పాటు కేంద్రం బాధ్యతారాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆస్తులు, ఉద్యోగులు విభజన పూర్తి కాలేదని అన్నారు. ఎపి సృష్టంచే అర్థరహిత అవరోధాలు, రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం అవలంభించిన వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం

తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం, అనంతరం తెలంగాణ సాధన విషయాలను అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ మరోసారి ప్రస్తావించారు. హైదరాబాద్ కొంతకాలం దేశంగా పరిగణించబడిందన్నారు. భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాష్ట్రంగా మారిందని తెలిపారు. అనంతరం హైదరాబాద్ ఎపిలో అంతర్భాగమైంది వివరించారు. తెలంగాణకు దశబ్దాల తరబడి అంతులేని అన్యాయానికి గురైందని వివరించారు. తెలంగాణలో ప్రజలు క్షోభ, బాధ అనుభవించారని, తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు కూడా చూశామని అంతేకాదు.. నిరాశలో ఉన్న యువత తుపాకులు పట్టి ఉద్యమం చేపట్టిందని చెప్పారు. తానూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని, తెలంగాణ అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొందని పేర్కొన్నారు. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్.. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్ అని అన్నారు. తాము ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం అని, తాము ఏం చేశామో ప్రజలకూ తెలుసు అని చెప్పారు.

పోరాటాలు చేశాం… జైలుకు వెళ్లామని అన్నారు. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా… ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించామని తెలిపారు. 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందని కెసిఆర్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాళ్లు గతంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేదని, ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసిందని అన్నారు. అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నామని తెలిపారు. గోదావరి జలాలు సాధించుకున్నామని అన్నారు. 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని వివరించారు. దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తాము కడుపు కట్టుకుని క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పార. కొందరు ఉద్యోగ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని సిఎం అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు

తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని, రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో తమ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుందని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానులను తానే స్వయంగా కలిసి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకువచ్చామని తెలిపారు. ఇకపై అటెండర్ నుంచి ఆర్‌డిఒ వరకు అన్ని ఉద్యోగులు స్థానికులకే లభిస్తాయని స్పష్టం చేశారు. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగటం కోసం అవసరమైన 1,12,307 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. దాంతోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి,మొత్తం 1,54,254 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించి, ఇప్పటివరకు 1,33,942 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పారు. మరో 22 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇకపై కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలు ఉండవు

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా లభించాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటారని, అయినప్పటికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడదనే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అందుకే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండ్టం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించిందని ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిందని అన్నారు.

అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసిందని అన్నారు. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించిందని చెప్పారు. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నదని సిఎం ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్

ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని సిఎం కెసిఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక నుంచి శాఖలవారీగా ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేసి, నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయని అన్నారు.తద్వారా ఖాళీలను అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదలవుతాయని తెలిపారు. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కెసిఆర్ స్పష్టం చేశారు.

అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తింపు

రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్‌డిఒ, డిఎస్‌పి, సిటిఒతోపాటు గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఉద్యోగ నియామకాల భర్తీపై శాసనసభ వేదికగా సిఎం సుధీర్ఘ ప్రసంగం చేశారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్‌డిఒ, డిఎస్‌పి, సిటిఒ, ఆర్‌టిఒ,డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదని, ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేదని, 20 శాతం నాన్ లోకల్ కోటా ఉండేదని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు సొసైటీల కిందకి వస్తాయని, దానికి నిబంధనలు వర్తించవని చెప్పి స్థానిక ఉద్యోగాలు కొల్లగొట్టారని చెప్పారు.

ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చని సిఎం పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్‌లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అన్నారు. 7 జోన్లు, 33 జిల్లాలవారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయని కెసిఆర్ స్పష్టం చేశారు.

గరిష్ట వయోపరిమితి పెంపు

ఉద్యోగార్థులకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ణ వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభ్తువం అవకాశం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒసి అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. వికలాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లకు పెరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు

గ్రూప్ 1 503 ఉద్యోగాలు

గ్రూప్ 2- 1,373 ఉద్యోగాలు

గ్రూప్ 4- 9,168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు

జిల్లాల్లాలో- 39,829

జోన్లలో- 18,866

మల్టీజోనల్ పోస్టులు- 13,170

ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు

సచివాలయం,హెచ్‌ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు

హైదరాబాద్ – 5,268

నిజామాబాద్- 1,976

మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769

రంగారెడ్డి- 1,561

కరీంనగర్- 1,465

నల్లగొండ- 1,398

కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340

భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257

సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213

ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178

మహబూబాబాద్- 1,172

హన్మకొండ- 1,157

మెదక్- 1,149

జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025

యాదాద్రి భువనగిరి- 1,010

జయశంకర్ భూపాలపల్లి- 918

నిర్మల్- 876

వరంగల్- 842

కుమ్రం భీం ఆసీఫాబాద్- 825

పెద్దపల్లి- 800

జనగాం- 760

నారాయణపేట్- 741

వికారాబాద్- 738

సూర్యాపేట- 719

ములుగు- 696

జోగులాంబ గద్వాల- 662

రాజన్న సిరిసిల్లా- 601

వనపర్తి- 556

……………………………………………..
మొత్తం 39,829
…………………………………………….

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు

జోన్లు

కాళేశ్వరం జోన్‌లో – 1,630

బాసర జోన్- 2,328

రాజన్న జోన్- 2,403

భద్రాద్రి జోన్- 2,858

యాదాద్రి జోన్- 2,160

చార్మినార్ జోన్- 5,297

జోగులాంబ జోన్- 2,190
……………………………………………………..
మొత్తం 18,866
…………………………………………………….

మల్టీజోన్లు..

మల్టీజోన్ 1- 6,800

మల్టీజోన్ 2- 6,370

ఏ శాఖలో ఎన్ని..

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బిసిల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

శాఖలవారీగా ఖాళీలు

హోం 18,334

సెకండరీ ఎడ్యుకేషన్ 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్ 7,878

బిసిల సంక్షేమం 4,311

రెవిన్యూ శాఖ 3,560

షెడ్యూల్డ్ కులాల అభివృవద్ధి శాఖ 2,879

ఇరిగేషన్, కమాండ్ ఏరియా డవలప్‌మెంట్ 2,699

ట్రైబల్ వెల్ఫేర్ 2,399

మైనార్టీస్ వెల్ఫేర్ 1,828

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయిమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16

మొత్తం-      80,039

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News