Monday, April 29, 2024

ఫూలే మార్గమే మహిళకు శిరోధార్యం

- Advertisement -
- Advertisement -

Womens celebrate International womens day

దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం, బిజెపి శ్రేణులు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాధాన్యత జాతీయ మహిళా దినోత్సవం జరపడానికి ఎందుకు ఇవ్వడం లేదు? సోషలిస్ట్ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు చేసిన ఆయా దేశాల ఉద్యమ సంస్థలు గత 110 సంవత్సరాల నుండి ప్రపంచ కార్మిక దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ దేశాలలో మహిళా ఉద్యమాలకన్నా 50 ఏండ్ల ముందే ఈ దేశ మహిళల విముక్తి కోసం త్యాగపూరిత ఉద్యమం చేసి ఎన్నో హక్కుల సాధనకు మూలమైన సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి జనవరి నెలంతా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని దేశీయ మహిళా సంఘాలు డిమాండ్ చేయాల్సిన అవసరముంది.

అన్ని రంగాల్లో మానవాభివృద్ధికి విద్య ప్రధానమైందని గుర్తించిన ఫూలే దంపతులు మహిళలు విద్యకోసం పునాదులు వేశారు. సావిత్రి బాయి ఫూలే కృషి వల్ల నేడు స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నతపదవులు చేపట్టారు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా ఇంటాబయట స్త్రీలపై హింస మాత్రం తగ్గడం లేదు. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆర్ధిక, సామాజికరంగాల్లో రానిస్తున్నప్పటికీ రాజకీయ రంగా ల్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికి ఇంకా ఇంట్లో మొగవాళ్ళ పెత్తనం వల్ల స్త్రీల రాజకీయాలు ఇంటికి గడప దాటడంలేదు. పీడితవర్గాలతో పాటు సమాజంలో సగభాగమైన స్త్రీలవిముక్తి జరగాలంటే చట్టాలు రూపొందించి అమలు చేసే చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో మహిళలు, సామాజిక ఉద్యమకారులు ఉద్యమించాలి.

మన దేశంలో స్త్రీలు దుర్మార్గమైన దోపిడీ, అణచివేతకు గురికావడానికి, రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించబడడానికి బ్రాహ్మణ వాదమే కారణమని బాబాసాహెబ్ అంబేడ్కర్ సూత్రీకరించాడు.ఈ సూత్రీకరణను పట్టించుకోని మహిళా సంఘాలు పితృస్వామిక వ్యవస్థ స్త్రీల అణచివేతకు కారణమని, పితృస్వామిక బావాజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించుకొని పోరాడుతున్నారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థలేని పాశ్చాత్య దేశాల్లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణం. స్త్రీలను దారుణంగా అణచివేసే మనుధర్మం అక్కడ అమలులో లేదు. కానీ మన దేశంలో మనుధర్మం నిర్దేశించిన అసమానతల కులదొంతరుల సమాజం ఉంది. కులం ప్రతి మనిషి హక్కులను నిర్దేశిస్తుంది, కులం ప్రతి స్త్రీ సామాజిక హోదాను నిర్ణయిస్తుంది. స్త్రీలకు ఆత్మవిశ్వాసం లేకుండాపోవడానికి, స్త్రీలకు స్వాభిమానం, స్వయం నిర్ణయాధికారం లేకుండా పోవడానికి కారణం కులం. ఆ కులవ్యవస్థను సృష్టించి కాపాడుతున్నది మనుధర్మ శాస్త్రం. ఆర్య బాపండ్లు నిర్మించిన కుల వ్యవస్థ వల్ల ఈ దేశం సర్వనాశనమైందనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఆధిపత్య కుల మహిళా సంఘాలు, ఆధిపత్య స్త్రీ వాదులు సిద్ధంగా లేరు. ఇండియా కన్నా 50 ఏండ్ల తర్వాత మహిళాఉద్యమం మొదలుపెట్టిన ప్రపంచ దేశాలు ఎన్నో విజయాలు సాధించి అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళుతుంటే ఇండియాలో మహిళల వెనుకబాటుతనానికి కారణాలను మహిళా సంఘాలు శోధించి ముందుకు సాగాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కారకురాలైన క్లారా జెట్కిన్‌ను గుర్తించినట్లుగా ఇండియాలో మహిళా హక్కుల కోసం, మహిళలకు చదువు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలేను గుర్తించి ఆ తల్లి స్ఫూర్తితో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరు చేయాలి. స్త్రీలందరూ ఒక్కటేననే బూటకపు వాదన వెనుక బ్రాహ్మణవాద కుట్ర ఉంది. ఆర్యబ్రాహ్మణ స్త్రీలు, మూలవాసి స్త్రీలు (ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ స్త్రీలు) స్వాభావికంగానే వేర్వేరు.రాజకీయంగా జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగిన స్త్రీలంతా ఆధిపత్య కులస్థులే. బహుజన రాజకీయ చైతన్యం వల్ల బెహేన్ జీ మాయావతి, మీరాకుమారి మాత్ర మే అందుకు మినహాయింపు. రాజకీయంగా ఎదగాలని ఆరాటపడుతున్న ఆధిపత్య కులాల స్త్రీలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల అగ్రకుల స్త్రీలే లాభపడతారని చేస్తున్న విమర్శను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టం తేవాలని చూస్తుంది. దళిత బహుజన మైనార్టీ స్త్రీలకు ఈచట్టంలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని బహుజన స్త్రీలు అడుగుతున్న డిమాండ్‌ను అగ్రకు ల మహిళా సంఘాలు అవహేళన చేస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నాయి. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల జరిగిన నష్టం కళ్ళముందు కనపడుతుంటేమహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లలో బిసి మహిళల వాటా ఎంతో స్పష్టంగా చెప్పాలని అడగడంలో తప్పేముంది? స్త్రీలంతా ఒక్కటేననే సంఘాలు ఎస్‌సి, ఎస్‌టి, బిసి స్త్రీల మీద అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు అగ్రకుల స్త్రీలమీద జరిగితే స్పందించినంత తీవ్రంగా ఎందుకు స్పందించరు? కులాన్ని బట్టి స్పందించడమే మహిళలంతా ఒకటి కాదని నిరూపిస్తుంది.

భారత జనజీవనంలో సగభాగమైన మహిళలను దశాబ్దాలుగా అణచివేసిన చరిత్ర వెనుక బ్రాహ్మణీయ (అ)ధర్మశాస్త్రం ప్రధానంగా పని చేసిందన్న సత్యం మరువ లేనిది. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’, ‘న స్త్రీ విద్యార్హతి’ అంటూ రాజశాసనంగా మహిళపై పురుషాధిక్యతను స్థిరపరిచింది.ఈ కారణంగా అనేక సాంఘిక కట్టుబాట్లకు, వివక్షలకు మహిళ లు గురికావాల్సి వచ్చింది. ముఖ్యంగా అభివృద్ధికి దోహదపడే విద్యకు స్త్రీలను వేల సంవత్సరాల పాటు దూరం చేశారు. ఇప్పటికీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్త్రీలు అణచివేతకు గురవుతున్నారంటే దానికి ఆర్య బ్రాహ్మణ వాదమే కారణం. ఆర్యబ్రాహ్మణులు మెజారిటీ ప్రజలైన దేశ మూలవాసి స్త్రీలను బానిసలను చేసి అజ్ఞానంలో ఉంచుతున్నారని గుర్తించి మొట్టమొదటి సారిగా శూద్ర, అతిశూద్రులకు పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించిన మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ణ ధర్మం, కుల ధర్మం బాపండ్ల కుట్రని, చదువుకునే హక్కు కుల మతాలకు అతీతంగా స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలనివాదించి ఆచరించి స్త్రీ విముక్తి కోసం త్యాగపూరిత పోరాటం చేసిన ఈ విప్లవకారున్ని అగ్రకుల స్త్రీ వాదులు స్మరించుకోరు. 1848లో జ్యోతిరావు ఫూలే స్థాపించిన పాఠశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసిన చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే శూద్ర, అతిశూద్ర స్త్రీలకు విద్య నేర్పించి తొలి మహిళా ఉపాధ్యాయురాలైంది. మహిళా విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన తొలి మహిళా నాయకురాలు కూడా సావిత్రిబాయి ఫూలే.

మానవ హక్కులు, పౌరహక్కుల అవగాహనతో పాటు ఆర్యబ్రాహ్మణ కుల వ్యవస్థకు మూలమైన భావజాలం మార్చితే తప్ప స్త్రీ పురుష సమానత్వం సాధించలేమన్న మూలవాసీతత్వ చింతనను అవివృద్ధి చేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే బహుజన ప్రజలతో పాటు అన్ని వర్గాల స్త్రీలకు ఆదర్శం కావాలి. స్తీల విద్య హక్కుల కోసం పాశ్చాత్య దేశాల్లో 1910 తర్వాత ఉద్యమాలు మొదలు కాగా అంతకన్నా కొన్ని దశాబ్దాల ముందే మన దేశంలో స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం కోసం ఉద్యమం నడిపిన గొప్ప విప్లవవాది సావిత్రిబాయి ఫూలే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ఆధునిక భావనతో ఈ దేశం నడవాలంటే అందుకు విరుద్ధమైన అసమానతల బ్రాహ్మనిజాన్ని, మనుధర్మానికి వ్యతిరేకంగా పోరా టం చేయాలి. ఈ క్రమంలో మన దేశంలో సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేయాలి. సావిత్రిబాయి ఫూలే వర్ధంతి స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. జాతీయ మహిళా దినోత్సవం ద్వారా ప్రజలను స్త్రీ పురుష సమాత్వం కోసం చైతన్యం చేయడం, చట్టసభల్లో చట్టాల అమలు ద్వారా మహిళలపై దాడులు, అత్యాచారాలు ఆగుతాయని, కఠినమైన శిక్షలు, ఎన్‌కౌంటర్ల ద్వారా మహిళలపై అత్యాచారాలు ఆగవని గుర్తించి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News