Sunday, May 12, 2024

రామమందిరంపై 70 ఏళ్లుగా తేల్చని కాంగ్రెస్: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

రామ మందిరం అంశాన్ని ఎటూ తేల్చకుండా కొనసాగించినందుకు’ ప్రతిపక్షంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కరసేవకులపై కాల్పులు జరిపిన వారికి, రామ మందిరం నిర్మించిన వారికి’ మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఒకరిని ఎంచుకోవాలని అమిత్ షా కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఈటాహ్ కాస్‌గంజ్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజ్‌వీర్ సింగ్ తరఫున బహిరంగ ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం ప్రతిష్ఠాపన ఉత్సవానికి హాజరు కానందుకు ప్రతిపక్ష నేతలను అమిత్ షా విమర్శిస్తూ, ‘ప్రతిష్ఠాపన ఉత్సవానికి హాజరుకాని వారికి కరసేవకులపై కాల్పులు జరిపింది తామేనని తెలుసు’ అని అన్నారు. ‘రామ భక్తులపై కాల్పులు జరిపిన వారు, రామ మందిరం నిర్మించిన వారు’ అనే రెండు గ్రూపులు ఉన్నాయని, జనం ఒక గ్రూప్‌ను ఎంచుకోవాలని ఆయన అన్నారు.

‘కాంగ్రెస్, రాహుల్ ‘బాబా’, అఖిలేశ్ యాదవ్ పార్టీ (సమాజ్‌వాది పార్టీ) 70 ఏళ్లకు పైగా రామ మందిరం అంశాన్ని నాన్చారు. మీరు మోడీజీని రెండవ సారి ప్రధానిని చేశారు. ఆయన జనవరి 22న ప్రతిష్ఠాపన ఉత్సవం నిర్వహణ ద్వారా ‘జై శ్రీరామ్’ అన్నారు’ అని అమిత్ షా చెప్పారు. వెనుకబడిన వర్గాల వారిని ప్రతిపక్షాలు అలక్షం చేశాయని కూడా మంత్రి ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత వారికి హక్కులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అమిత్ షా తూర్పారపడుతూ, ‘బిజెపికి 400 సీట్లు వచ్చినట్లయితే, అది రిజర్వేషన్ తొలగిస్తుందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. మాకు రెండు సార్లు పూర్తి మెజారిటీ లభించిందని, కానీ నరేంద్ర మోడీ రిజర్వేషన్ మద్దతుదారు అని చెప్పాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు. ‘బిజెపి ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు రిజర్వేషన్లను తొలగించదని, వేరెవరినీ ఆ పని చేయనివ్వదని చెప్పాలని అనుకుంటున్నా’ అని అమిత్ షా తెలిపారు.

నిరుపేదలకు ఉచిత రేషన్, ఇళ్లుతో సహా బిజెపి పథకాలను అమిత్ షా వివరిస్తూ, బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే, ఉచిత రేషన్ పథకం 2029 వరకు కొనసాగుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులను మాత్రమే ఎన్నికల్లో నిలబెట్టినందుకు సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను ఆయన విమర్శించారు. సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ హయాంలో జనం వలస వెళ్లవలసి వచ్చేదని అమిత్ షా ఆరోపిస్తూ, ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి పాలనలో ‘జనం కాకుండా గూండాలే వలస వెళ్లవలసి వస్తోంది’ అని చెప్పారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ఒకప్పుడు బాంబులు పేలుతుండేవి. ఇప్పుడు మోడీ నాయకత్వంలో ఎగుమతి కోసం ‘బాంబుల’ తయారీ జరుగుతోంది’ అని అమిత్ షా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News