Tuesday, April 30, 2024

వయో వృద్ధులకు రెడ్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

భారతీయ రైల్వేలు… ప్రయాణ ప్రగతికి మార్గాలు… కాదనలేని నానుడి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రధానంగా వయో వృద్ధులను తీవ్రంగా కలచివేసిన్నది. గతంలో అమలైన సీనియర్ సిటిజన్స్ రాయితీలను కొనసాగించలేమని, ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంటు ముఖంగా ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా క్షేమమే పరమావధిగా ప్రకటిస్తూ… ముందుకెళ్తున్న పాలకులు ఈ తరహా రాయితీల విషయమై పట్టించుకోకపోవడంతో సకల జనులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాధారణ ప్రజానీకానికి ప్రయాణ వాహక నౌకగా కీర్తించబడే రైళ్ళలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఎత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరాన్ని, ప్రయాణానుభూతి చవకగా లభించే సౌకర్యం చేజారటం నివ్వెరపరచింది. సమాజంలోని రకరకాల వర్గాలకు ఎన్నెన్నో మార్గాల్లో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వం… జనులందరికీ ఉపయుక్తమైన చర్యలను నిలిపివేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

రైళ్ళలో గతంలో సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 58 ఎళ్ళు నిండిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్ళు నిండిన పురుషులకు 40 శాతం రాయితీలు ఇస్తున్నారు. ఈ సౌకర్యం ఎన్నో ఏళ్ళ నుంచి అమలవుతోంది. కరోనా పుణ్యమాని సీనియర్ సిటిజన్స్ రాయితీలను నిలిపివేశారు. ఆ పిమ్మట అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నా రాయితీల పునరుద్ధరణ జరగలేదు. ఇక ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి ఎంతో భారమవుతోందంటూ నిన్నటికి నిన్న రైల్వే మంత్రి సెలవిచ్చారు. అయితే ఈ భారం కరోనా ముందు కూడా ఉన్నదే అంటూ వయో వృద్ధులు పేర్కొంటున్నారు. ప్రతి మనిషీ ఏదో ఒక రోజున సీనియర్ సిటిజన్ కావడం తప్పదంటున్నారు.

ప్రయాణికుల సేవల కోసం ప్రభుత్వం గత ఏడాది. రూ. 59 వేల కోట్లు రాయితీ ఇచ్చిందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు సమకూరుస్తున్నట్లు రైల్వే శాఖ వివరిస్తోంది. అయితే రాయితీల అంశం ప్రయాణికుల సదుపాయాల్లోకి రాకపోవడం శోచనీయమని సీనియర్ సిటిజన్లు సంఘాలు నివేదిస్తున్నాయి. అంతులేని, హద్దుల్లేని… కోట్లాది రూపాయలు వెచ్చించి తీసుకొచ్చే ఉచిత పథకాల కన్నా… ప్రజా బాహుళ్యాన్ని ఆకట్టుకునే, ఆదరించే రాయితీ కల్పన మేలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు లభిస్తున్న రాయితీలు పూర్తిగా రద్దు చేస్తే ప్రజలు ఏం కోల్పోతారో మనకు స్పష్టమవుతుంది. సగటు జీవికి అందుతున్న రైల్వే రాయితీలు భారమవుతున్నాయంటున్న పాలకులు కార్పొరేట్లు, బహుళ జాతి సంస్థలకు దేశ సంపదను అప్పనంగా కట్టబెట్టటం లేదా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దీన్ని మేధావులు, మీడియా తులనాత్మకంగా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.
గరీబ్ రథ్ పేరిట అప్పట్లో సరికొత్త రైళ్ళను సాధారణ, మధ్యతరగతి ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టారు.

ఎసి బోగీల్లో ప్రయాణిస్తూ చవకగా గమ్యాలను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. జనం కూడా కాస్తంత తక్కువ ధరలోనే టికెట్లుకొని ప్రయాణ అనుభూతిని పొందారు. ఈ తరహాలో వయోవృద్ధులకు రాయితీలిచ్చే సమగ్ర ప్రణాళికను రూపొందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవలే వందే భారత్ రైళ్ళను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన మార్గాల్లో ప్రవేశపెట్టింది. రైల్వేలు సాంకేతికపరంగా గొప్ప ప్రగతినే చాటాయి. సమయం కుదింపు… టెక్నాలజీ సమ్మిళితమైన ఎన్నో ఆకర్షణలు భాగమయ్యాయి.కాస్త ఖరీదైన రైలు ప్రయాణం కావడంతో సాధారణ జనానికి అవి అందుబాటులో ఉండటం కద్దు. సువిశాల భారతంలో ఒక వైపు నుంచి మరో వైపునకు పయనించడానికి రైలు ప్రయాణమే ఆధార మన్నది తెలిసిందే. రోజూ నడిచే వందలాది రైళ్ళలో లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు.

అందుకే వారికి దక్కే రాయితీల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా అనంతరం ఈ రాయితీల పునరుద్ధరణ కోసం అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య… రాయితీల ప్రకటనపై తర్జనభర్జనలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. వయో పరిమితిని 60 నుంచి 70 ఏళ్ళకు పెంచడం, జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు మాత్రమే వర్తించేలా ప్రకటన రావచ్చంటూ ఊదరకొట్టారు. అయితే వారంలోనే సీనియర్ సిటిజన్ల రాయితీ ఇప్పట్లో లేదని రైల్వే మంత్రి ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. ఏతావాతా పలువురికి ఉపకరించే సీనియర్ సిటిజన్స్ రాయితీల పునరుద్ధరణపై కేంద్రం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి అనుభూతులను పరిగణించాలని సకల జనుల ఆకాంక్ష….ఘోషా…!

చెన్నుపాటి రామారావు
9959021483

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News