Tuesday, April 30, 2024

సర్వభాషలకు ‘జనని’ సంస్కృతం కాదు!

- Advertisement -
- Advertisement -

జీవ పరిణామం ఎలా జరుగుతూ వచ్చిందో, భాషా పరిణామాలు కూడా అలాగే క్రమక్రమంగా కొనసాగాయి. ఉన్నఫళంగా ఏదీ ఎక్కడి నుంచి ఊడిపడలేదు. భాషా పరిణామం గురించి మాట్లాడుకోవాలంటే, అంతకు ముందు కొన్ని పదాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మాటలు లిపి భాష అనే పదాల మధ్య గల వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. రాతి యుగంలో సైగలు, ధ్వనులతోనే మనుషుల సంభాషణ సాగింది. క్రమంగా ధ్వనులు మాటలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. మానవ పరిణామ దశలో మొదట ఒకరి నుండి ఒకరు కొన్ని విషయాలు తెలియజేసుకోవడానికి మాటలు అవసరమయ్యాయి. ఒక దశ లో అక్షరాలు లేవు. లిపి లేదు. భాషకు ఒక స్వరూపం లేదు. తర్వాత కాలంలో మాటల్ని అక్షరాల ద్వారా వ్యక్తీకరించడం కోసం అక్షరాలకు రూపకల్పన జరిగింది.

దాన్ని ‘లిపి’ అని అన్నాం. మాటల్లో చెప్పగలిగే దాన్ని అక్షరాల్లో కూడా పొందుపరచ గలిగితే దాన్ని ‘భాష’ అన్నాం. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆదివాసీ జాతుల మాటలకు లిపి లేదు. అందుకే అవి భాషలుగా గుర్తించబడలేదు.
ఒక వెయ్యేళ్ళ క్రితం సంస్కృతం భారత దేశం వచ్చినప్పుడు దానికి లిపి లేదు. అప్పటికి ఇక్కడ వ్యాప్తిలో వున్న దేవనాగరి లిపి (మన హిందీ లిపి) లో దాన్ని రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో అన్ని భారతీయ భాషల్లో సంస్కృతాన్ని రాయడం మొదలు పెట్టారు. తనకై తాను ఒక లిపిని అభివృద్ధి చేసుకొని సంస్కృతం అన్ని భాషలకు ‘జనని’ ఎలా అవుతుంది? అది ఎదగని భాష! మాటలు భాషగా స్థిరపడాలంటే లిపిని రూపొందించుకోవడం అవసరం. లిపి లేని మాటల్ని (సంభాషణల్ని) హిందీలో ‘బోలీ’ అని అంటారు. ఆ రకంగా సంస్కృతం ఒక బోలీ.

అది మన దేశం వచ్చాక ఇక్కడి దేవనాగరి లిపి మీద ఆధారపడింది. ఇంతకూ దేవనాగరి లిపి ఎప్పుడు అభివృద్ధి చెందిందీ అంటే చారిత్రక ఆధారాల ప్రకారం దేవనాగరి లిపి తొమ్మిదో శతాబ్దాం తర్వాత మాత్రమే కనిపిస్తోంది. ఆ విధంగా సంస్కృత భాషా వికాసం తొమ్మిదో శతాబ్దం తర్వాతనే జరిగిందని చెప్పాలి. అందువల్ల సంస్కృతం ఆది భాష, సర్వభాషలకు ‘జనని’ అనేది శుద్ధ అబద్ధం! ఒక తప్పుడు ప్రచారం మాత్రమే. సంస్కృతం అంటేనే సంస్కరించబడింది అని అర్థం. ముందు ఒక భాష వుంటేనే, అది సంస్కరించబడితేనే అప్పుడది సంస్కృతమయ్యింది.పైగా ఈ భాషకు మన దేశంలో ఒక క్షేత్రమంటూ లేదు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ వంటి భాషలకు నిర్దిష్టమైన క్షేత్రాలు వున్నాయి. ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీలకు దేశంలో ఒక నిర్దుష్టమైన భూమి అంటూ లేదు. ఆ భాషలు తెలిసిన వారు దేశంలో అక్కడక్కడా వుండొచ్చు. భాషకు ఒక భూమి వున్నప్పుడు, ఆ భూమి మీద పుట్టి పెరిగిన వారికి అది మాతృభాష అవుతుంది. అక్కడి జనమంతా ఆ భాషే మాట్లాడుతారు. ఆర్యులతో పాటు సంస్కృతం బయటి నుండి వచ్చిందే! ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకోవాలి.

1. సంస్కృతం మాట్లాడే ప్రదేశం/ రాష్ట్రం భారత దేశంలో ఎక్కడా లేదు.
2. మనువాదులు బలవంతంగా తమ హిందూ దేవీ దేవతల పూజల్లో, వ్రతాల్లో, కర్మకాండల్లో ఉపయోగించడం తప్ప, సంస్కృతం ఎక్కడా నిత్య జీవితంలోని సంభాషణల్లో భాగం కాలేదు. 3. సంస్కృతం ఎప్పుడూ ఎక్కడా ప్రజల భాషగా లేదు. ఒక వర్గం వారికే అది పరిమితమైంది. ఇకపోతే సాధారణ శకానికి ముందు బిసిఇ అసలు ఎక్కడా దేశంలో సంస్కృతం లేదు అనేది రుజువైంది. మనువాదుల అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి మనం వాస్తవం లోంచి విషయం పరిశీలిద్దాం! బహుజన చక్రవర్తి అశోకుడి కాలం నాటికి (268 232 బిసిఇ) ఈ దేశంలో వున్నది ప్రాకృత భాష, దాని మరొక రూపమే పాలి భాష. ఆ భాషను ధమ్మ లిపిలో రాసేవారు. సాధారణ శకానికి ముందు నాటి స్థూపాలు, శిలా ఫలకాల మీద అంతటా ప్రాకృతమే వుంది. ఎక్కడా దేశంలో సంస్కృత శిలా ఫలకాలు లభించ లేదు.

కారణం ఆ భాషే అప్పటికి లేదు కాబట్టి! పైగా సంస్కృతం విస్తృతంగా జనంలోకి వెళ్ళకుండా మనువాదులే అడ్డుకట్ట వేసుకున్నారు. తమ జ్ఞానం ఇతరులకు అందగూడదని కేవలం తమ వర్ణం వారికి మాత్రమే అందాలని కుత్సిత బుద్ధితో సంస్కృత భాషా వ్యాప్తిని అడ్డుకున్నారు. తమ వర్గానికి చెందని వారెవరైనా సంస్కృత పదం ఉచ్ఛరిస్తే వారి నాలుకలు తెగ్గోశారు. అదంతా మళ్ళీ వేరే విషయం. ఇప్పుడు ఆ విషయాలు అందరికీ తెలిసినవే. ఒకప్పుడు అక్షరాస్యులు, విద్యావంతులు, పండితులు అంటే వారు కేవలం అగ్రవర్ణం వారే బ్రాహ్మణులే. నాలుగు శ్లోకాలు నేర్చుకొని, గుళ్ళ మీద, మతం మీద పట్టు బిగించి రాజుల్ని, చక్రవర్తుల్ని సైతం తమ చెప్పుచేతల్లో వుంచుకొన్నారు. హిందూ మతోద్ధారకులుగా తోచిందేదో చెప్పి, జనాన్ని మూఢ నమ్మకాల్లో ముంచేశారు. వారిని ప్రశ్నించిన వారిని దుష్టులుగా, ధూర్తులుగా చిత్రించారు. ఆ మనువాదుల ప్రభావంలోపడి ఒక్కోసారి పరాయీకరణ చెంది సామాన్య ప్రజలు తరతరాలుగా అర్థం లేని ఆచారాలు పాటిస్తూ తమకు తాము సజ్జనులుగా భావించుకొన్నారు.

అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. శతాబ్దాలు గడిచినా జనం ఆ బంధనాల్ని తెంపుకొని స్వేచ్ఛగా ఆలోచించలేకపోతున్నారు. మనువాదులు అలవాటు చేసిన దేవీ దేవతల్ని కొలుస్తూ, వారి పండగలే జరుపుకుంటూ తాము కూడా తక్కువేమీ కాదు, అని పొంగిపోతున్నారు. ‘తమది కూడా అగ్రవర్ణం వారి స్థాయినే’ అని అనుకుంటున్నారు. తప్పిస్తే, కులం, గోత్రం, మతం అందులో శాఖలూ వదిలేసి మనుషులం మనుషుల్లా ప్రవర్తిద్దాం అని అనుకోవడం లేదు. ఎప్పుడో శతాబ్దాల కింద జరిగిన కుట్రకు బలైపోయామన్న విషయం గ్రహించుకోవడం లేదు. అన్నిటికీ మించి మానవత్వం అనేది ఒకటి వుందని దాన్ని అందరం కలిసి నిలుపుకోవాల్సి వుందని అనుకోవడం లేదు. ఎన్నో పెద్ద పెద్ద కుట్రల్లో “సంస్కృతం అన్ని భాషలకు జనని” అని చెప్పడం కూడా కుట్రే ఎందుకంటే ఆ భాషతోనే అగ్ర వర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా నాగరికతలు ఏర్పడుతూ వచ్చాయి. ఒక్కో నాగరికత ఒక్కో రకమైన మాటల్ని, ఒక్కో రకమైన లిపిని, ఒక్కో రకమైన భాషని రూపొందించుకుంటూ వచ్చాయి. మనకు మన దేశంలో సింధూ నాగరికతలో 4500 ఏళ్ళ నాటి లిపి లభ్యమైంది. అయితే దాన్ని ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయారు. అదే లిపికి దరిదాపులుగా వున్న మరి కొన్ని లిపులు కూడా లభ్యమయ్యాయి. అవే ధమ్మ లిపి, గోండ్ లిపి వంటివి. వాటిని కూడా పూర్తిగా అర్థం చేసుకునే వారు లేకపోవడం వల్ల అవి అంతర్జాతీయ భాషల జాబితాలో చేరలేదు. వేల సంవత్సరాల తర్వాత అప్పటి అక్షరాలు, అంకెలు, గుర్తులు తెలుసుకోవడం కష్టం. అక్షర మంటే ఒక రకమైన ‘కోడ్’. దాన్ని ఎలా పలకాలి? ఎలా పలికితే ఏ అర్థం వస్తుంది. అనేది తెలియనంత వరకు ఏ లిపి అయినా, ఏ భాష అయినా అర్థం కాదు. తర్వాత వచ్చిన చారిత్రక యుగంలోని లిపులు అధ్యయనం చేయడానికి వీలయ్యింది. సమ్యక్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు అనేకం దొరికాయి. అశోకుడి శిలా శాసనాలు అధికంగా లభించాయి. అవన్నీ ధమ్మ లిపిలో వున్నాయి. బుద్ధుడి సమకాలికుడైన పసేన్ జీత్ శిలా శాసనం ఒకటి మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దొరికింది. అది కూడా ధమ్మ లిపిలోనే వుంది. ఇదే ఇక్కడ చాలా కీలకమైన విషయం. మనువాదులు చెప్పుకుంటున్నట్టు సంస్కృతమే అతి ప్రాచీనమైన భాష అయితే మొదట ఆ భాషలోని శిలా శాసనాలు దొరకాలి కదా? దొరకలేదు. దొరకవు. ఎందుకంటే సంస్కృతానికి లిపే లేదు. లిపి లేని భాషలో ఎవరు మాత్రం ఏం రాస్తారూ?

సృష్టి ప్రారంభం నుండే సంస్కృతం వుంది. వేదాలు, పురాణాలు ఆ దేవదేవుడే స్వయంగా మానవులకు అందించాడు వంటి కట్టుకథల్ని వివేకవంతులు విశ్వసించరు. పరిణామక్రమం, చారిత్రక ఆధారం, వికాసం ఎలా ఎప్పుడు జరుగుతూ వచ్చాయో పరిశీలించి, పరిశోధించి నిగ్గు తేల్చిన తర్వాత మాత్రమే ఏ విషయాన్నైనా వారు గుర్తిస్తారు. జరిగిన తప్పిదం ఏమిటంటే ధమ్మలిపిలో దొరికిన పాలి శాసనాలు సంస్కృతంవి అని అబద్ధపు ప్రచారం చేశారు. అంతే కాదు ఒక్కోసారి ధమ్మ లిపిని బ్రాహ్మి లిపిగా ప్రకటించారు. ఉదాహరణకు 2వ శతాబ్దంలో లభించిన జూనాఘడ్ శాసనం పాలి లిపిలో వుంది. దాన్ని గుర్తించలేక అది సంస్కృతమని భ్రమపడ్డారు. అసలైతే అప్పటికి సంస్కృతం భారత దేశానికి రాలేదు. వచ్చాక అది దేవనాగరి లిపిలో నమోదయ్యింది. చెపితేగిబితే అది దేవనాగరి లిపి అని చెప్పాలి కాని, సంస్కృతం అని అనడం తప్పుకదా? మరొక ముఖ్య విషయమేమంటే ధమ్మ లిపిలో సంస్కృతం రాయలేరు. క్రి కృ / లాంటి శబ్దాలు దేవనాగరి లిపిలో రాసుకోవాల్సిందే గాని ధమ్మలిపిలో రాయడం అసలే కుదరదు. ఆ శబ్దాలే ఆ లిపిలో ఇమడవు. పదవ శతాబ్దం తర్వాత ‘ధమ్మ’ ను ‘ధర్మ’ అని రాయడం ప్రారంభించారు. పేర్లతో సహా అన్నింటినీ సంస్కృతీకరించడం అప్పటి నుండే ఆరంభమైంది.

ఉదాహరణకు విక్ మాదత్ (పాలి భాషలో) ను సంస్కృతీకరించి విక్రమాదిత్యగా మార్చారు. చద్ గుపత్ (పాలి)ని సముద్ర గుప్తుడుగా మార్చారు. వీరు హిందూ రాజులు కాకపోయినా హిందూ రాజులుగా ప్రచారం చేశారు. 9వ శతాబ్దం నాటి నలందా విశ్వవిద్యాలయం అధికార ముద్ర (SEAL) లభించింది. దాని మీద శ్రీ నలందా మహావిహార్ అని వుంది. విహారాలు, ఆరామాలు బౌద్ధలకు సంబంధించిన పదాలు దాని ముందు శ్రీ చేర్చడం హిందూ మనువాదుల దౌర్జన్యం. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోదలచిన వారు సమ్యక్ ప్రకాశన్ వారు ప్రచురించిన ‘భ్రమ్‌క పులిందా’ చదవాలి. దీని రచయిత రాజీవ్ పటేల్. ఈయన సంజయ్ కుమార్‌తో కలిగి ఇంగ్లీషు వర్షన్ కూడా ప్రకటించారు. బ్రాహ్మణార్యుల మతం వైదిక మతం; జాతి ఆర్యజాతి; భాష సంస్కృతం. మొదట సంస్కృతం ఆరియన్ లేక ఆరియకీ మాండలికానికి సంబంధించిన ఛండా భాష.

అది సంస్కరించబడి వైదిక సంస్కృతంగా గుర్తించబడింది. ఆర్యవర్ణ మత సంస్కారాలకు ఆలవాలమైన భాషగా స్థిరపడింది. తర్వాత కాలంలో బ్రాహ్మణార్యులు ద్రావిడ జీవన విధానాల్లోకి తమ పురాతన ఆరియన్ సంస్కృతాన్ని (ఛండా మాండలికాన్ని) జొప్పించారు. అందువల్ల ఆరియన్ మూలాలున్న వైదిక ఛండా భాషగా మాత్రమే సంస్కృతాన్ని గుర్తించాలి! సంస్కృతం లిపి లేని భాషగా చాలా కాలం కొనసాగింది. అది ఈ దేశపు ‘నాగరి’ లిపిని ఆశ్రయించింది. దానికే దేవ శబ్దాన్ని జోడించి ‘దేవనాగరి’ గా ప్రచారం చేసుకున్నారు. పనిలో పనిగా సంస్కృతాన్ని “దేవభాష’గా ఉన్నతీకరించుకున్నారు. అది ఎప్పుడూ వ్యవహార భాష గా లేదు. స్తుతి, స్తోత్రాలతో మాత్రమే కొనసాగింది. ఇప్పటికీ అది వాటికే కుంచించుకుపోయి వుంది. పూర్తిగా ఇది ఇండోయూరోపియన్ భాష కాదు. బ్రాహ్మణిజం సంస్కృతం రెండూ పెనవేసుకుపోయి అర్చక, స్తోత్ర, పూజాది మతపరమైన విషయాలకు మాత్రమే పరిమితమైంది. అలౌకిక విషయాల ప్రచారంలో మునిగిపోయింది. దీన్ని మత ఫాసిజంగా (Rightist Riligious Fascism) గా గుర్తించాలి!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News