Saturday, April 27, 2024

హైదరాబాద్‌కు మరో ‘లైఫ్‌సైన్స్ దిగ్గజ కంపెనీ’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్మా, గ్లోబల్ క్యాపబులిటీ క్యాంపస్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబులిటీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శాండోస్ కంపెనీ సీఈఓ రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం మంత్రి కెటిఆర్‌తో మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమై ఈ మేరకు తమ గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబోరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

రెండో అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో..

హైదరాబాద్ కేంద్రంగా శాండోస్ కంపెనీ తన గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న వ్యాపార అనుకూలత, అద్భుతమైన మానవ వనరుల ఆధారంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. శాండోస్ కంపెనీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నగరంలోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కలిగి ఉందని, ఇదే స్థాయిలో శాండోస్ కంపెనీ కూడా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్ ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కెటిఆర్ వివరాలు అందజేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ గురించి వివరాలు అందజేసిన కెటిఆర్, శాండోస్ లాంటి కంపెనీకి ఫార్మాసిటీ అద్భుతమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంటుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

తమ భవిష్యత్ ప్రణాళికలకు రాష్ట్రం అనుకూలం..

నగరంలో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధి బృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ఇప్పటికే తమ గ్రూప్ సంస్థ నోవార్టీస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తుందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే పరిశోధనలను ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికే తమ సంస్థ వెయ్యికి పైగా మాలిక్యుల్స్‌ని కలిగి ఉన్నదని, దాదాపు పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జిస్తుందని, హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్ ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది. తమ కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కెటిఆర్ అందిస్తున్న సహాయ, సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News