Tuesday, April 30, 2024

ముషారఫ్ అంత్యక్రియల్లో పాల్గొన్న రిటైర్డ్ , ప్రస్తుత మిలిటరీ అధికార్లు

- Advertisement -
- Advertisement -

కరాచీ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో జరిగాయి. రిటైర్డ్, ప్రస్తుత మిలిటరీ అధికారులు, బంధువుల సమక్షంలో మంగళవారం కరాచీ లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో మలిర్ కాంట్ లోని గుల్‌మొహర్ పోలో గ్రౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో భౌతిక కాయానికి అంతిమ సంస్కారాల్లో భాగంగా ప్రార్థనలు చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సాహిర్ షంషద్ మీర్జా, మాజీ ఆర్మీ చీఫ్‌లు జనరల్ (రిటైర్డ్) కమర్ జావేద్ బజ్వా, జనరల్ (రిటైర్డ్) ఆస్ఫాక్ పర్వేజ్ కయానీ, మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌లు జనరల్ (రిటైర్డ్) షుజా పాషా, జనరల్ (రిటైర్డ్) జహీరూల్ ఇస్లామ్, తదితరులు అనేక మంది ముషారఫ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పాకిస్థాన్ ప్రధాని కానీ, అధ్యక్షుడు కానీ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆర్మీగ్రేవ్ యార్డ్‌లో ముషారఫ్ భౌతిక కాయాన్ని సమాధి చేస్తారు. దుబాయ్ నుంచి చార్టెర్డ్ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి ముషారఫ్ భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఆ భౌతిక కాయంతోపాటు భార్య సాబా, కుమారుడు బిలాల్, కుమార్తె, ఇతర దగ్గరి బంధువులు మాల్టా ఏవియేషన్ విమానంలో వచ్చారు.

యుఎఇ అధికార వర్గాలు ఈ ఏర్పాట్లు చేశాయి. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం పాత టెర్మినల్ వద్ద అత్యంత భద్రత మధ్య విమానం చేరుకుంది. తరువాత ముషారఫ్ భౌతిక కాయాన్ని మలిర్ కంటోన్మెంట్ ఏరియాకు తీసుకెళ్లారు. ముషారఫ్ తల్లికి దుబాయ్‌లో అంత్య క్రియలు జరగ్గా, తండ్రి అంత్యక్రియలు కరాచీ లోనే జరిగాయి. ముషారఫ్ అంత్యక్రియలకు సంబంధించి ప్రార్ధనలు చేయడంలో సెనేట్‌లో స్వల్ప విభేదాలు తలెత్తాయి. ఎవరైనా అధినేతలు చనిపోతే పాక్ పార్లమెంట్‌లో నివాళులు అర్పించడం పంప్రదాయంగా వస్తోంది. అయితే పార్లమెంట్ ఎగువ సభలో ఈ విషయమై ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. అంత్యక్రియల ప్రార్ధనలపై విపక్ష నేత సెనేటర్ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాప్ పార్టీనేత షెహ్‌జాద్ వసీం తీర్మానం ప్రతిపాదించారు. దీనికి ఆ పార్టీ లోని ఇతర నేతలు మద్దతు పలికారు. అయితే మరో వర్గం వారు దీనికి వ్యతిరేకత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News