నల్లగొండ: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు ఇచ్చిన నోటీసులపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని, చట్టాలు, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, కాంగ్రెస్, బిజెపి ఆడుతున్న నాటకంలో భాగంగానే నోటీసులు ఇచ్చారని, ప్రజా సమస్యలు గాలికొదిలి తమకు నోటీసులిస్తున్నారని, దిక్కుతోచని పరిస్థితుల్లోనే కెసిఆర్కు నోటీసులు ఇచ్చారని కెటిఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. కమీషన్లు తప్ప రేవంత్ ప్రభుత్వానికి పాలన చేతకాదు అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులే కమీషన్లపై మాట్లాడుతున్నారని, ఎన్ని నోటీసులు ఇచ్చినా దూదిగింజల్లా ఎగిరిపోతాయన్నారు.
కాళేశ్వరం దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, ఈటల రాజేందర్లు విచారణకు రావాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు జారీచేసింది. ముగ్గురు హాజరయ్యేందుకు 15 రోజులు గడువును కమిషన్ ఇచ్చింది. కమిషన్ ఎదుట హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జస్టిస్ పిసి ఘోష్ ఈ నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.