హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు త్వరగా
అనుమతులు ఇవ్వాలి ఆర్ఆర్ఆర్
ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి
కేబినెట్ ఆమోదించాలి ఆర్ఆర్ఆర్కు
సమాంతరంగా రైల్వేలైన్ ఇవ్వాలి
సెమీకండక్టర్ రంగానికి సహకరించాలి
మోడీకి ముఖ్యమంత్రి వినతి
హైదరాబాద్కు 800 ఇవి బస్సులు
కేంద్రమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని, అనుమతులు ఇచ్చే లా పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించాలని ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు 50శాతం ఖర్చును రాష్ట్ర ప్ర భుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని సిఎం రేవంత్రెడ్డి ప్రధానితో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానమంత్రి దృష్టికి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను తీసుకెళ్లారు.
మెట్రో ఫేజ్-2కు కేబినెట్ ఆమోదం తెలపాలి
హైదరాబాద్ మెట్రో రైలును నగరంలోని ఇతర ప్రాంతాల కు విస్తరించాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం మెట్రోకు సంబంధించి ఎలాంటి విస్తరణ చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని మోడీతో పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రో ఫేజ్- 2 విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించామని, ఫేజ్ 2లో 5 కారిడార్లు ఉన్నాయని, మొత్తం 76.4 కి.మీలని, ఇది కేంద్రం, రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అని, మొ త్తం ఖర్చు రూ.24,269 కోట్లు చెప్పారు. అందులో కేంద్రం వాటా 18% (రూ.4,230 కోట్లు), రాష్ట్రం వాటా 30% (రూ.7,313 కోట్లు), రుణం 48% (రూ.11,693 కోట్లు) అని ప్రధానికి సిఎం వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2024, నవంబర్ 4న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిందని, వాటిపై కేంద్రం కొన్ని అనుమానాలను వ్యక్తం చేయగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఆర్ఆర్ఆర్ భూ సేకరణలో 50% వ్యయం
హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాం తీయ రింగ్రోడ్డును (ఆర్ఆర్ఆర్) తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని ప్రధాని మోడీతో సిఎం రేవంత్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ (ఎన్హెచ్ 161)లో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నా రు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో చౌటుప్పల్ – అమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి (ఎన్హెచ్65) తదితర ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందని సిఎం రేవంత్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి భూముల సేకరణకు 2022లో ప్రారంభమయ్యిందని, ఈ భూ సేకరణ వ్యయంలో రాష్ట్రం 50శాతం భరిస్తోందని సిఎం ప్రధానికి తెలిపారు. 90శాతం భూములకు సంబంధించిన ప్రపోజల్స్ ఎన్హెచ్ఏఐకి పంపామని, ఎన్హెచ్ఏఐ కూడా టెండర్లు పిలిచిందన్నారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో కలిపి ఏక కాలంలో చేపట్టాలని ప్రధాని మోడీకి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ వృద్ధితో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సిఎం రేవంత్ తెలిపారు. ఇప్పుడున్న ఓఆర్ఆర్ రానున్న 5 సంవత్సరాల్లో సరిపోదని ఇప్పటికే ఓఆర్ఆర్ పై రోజుకు లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయని సిఎం పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తే సరైన ఉపయోగం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50శాతం భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రైల్వే లైన్
రీజినల్ రింగ్రోడ్డుకు సమాంతరంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 35శాతం ఔషధాలను ఉత్పత్తి చేస్తోందని, బందరుపోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందన్నారు. తయారీ రంగానికి ప్రోత్సాహాకరంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలు సృష్టిస్తుందని అన్నారు.
సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వాలి
సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీకి సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్ట్కు కేంద్రం ఆమోదం తెలపాలని, దానివల్ల పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుందని, 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న లక్ష్యానికి తోడ్పాటునందిస్తుందన్నారు.
రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలి
రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానికి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ప్రభుత్వ, -ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని డిఆర్డిఓ, డిఫెన్స్ పిఎస్యూలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని వాటి పరిధిలో 1,000కి పైగా ఎంఎస్ఎంఈలు – స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సఫ్రాన్ అండ్ హానీవెల్ వంటి సంస్థలు హైదరాబాద్పై ఆసక్తి చూపుతున్నాయని సిఎం ప్రధానితో పేర్కొన్నారు. రక్షణ రంగంలోని జేవీ అండ్ అప్సెట్లకు కేంద్ర ఆర్డర్లు తక్షణ అవసరమని ఆయన తెలిపారు. వాటికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని సిఎం రేవంత్ ప్రధానికి సూచించారు.
హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్
కారిడార్ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి
హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదనకు మద్ధతు ఇవ్వాలని ప్రధాని మోడీకి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ప్రోత్సాహం ఉందని, కానీ, హైదరాబాద్కు లేదని సిఎం పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి చేశారు. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్ఫోను నిర్వహించాలని సిఎం సూచించారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాకాలు, పిఎల్ఐ లాంటి మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు.