మన తెలంగాణ/మోత్కూరు: ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) ఇప్పించే భాద్యత నాది అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎల్.ఎన్ గార్డెన్స్లో మున్సిపాలిటీ పరిదిలోని, మండలంలోని గ్రామాలలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఎమ్మెల్యే ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ స్మశాన వాటికలు, వైకుంఠ దామాలు కడితే ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళలోనే కూలిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరుగుతున్నాయని, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు సామేల్ తెలిపారు.
కెసిఆర్ 7లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ నాయకునికీ రాని విధంగా తనకు 52వేల మెజార్టీ తుంగతుర్తి ప్రజలు ఇచ్చారని నిత్యం ప్రజలతోనే ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) రాని వారు ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ ఇందరిమ్మ ఇండ్లు ఇప్పించే భాద్యత తనది అని అన్నారు. మోత్కూరు ప్రాంతానికి సాగు, తాగు నీరందించే బునాది గాని కాల్వ భూ సేకరణ సర్వే పూర్తి కావచ్చిందని, భూసేకరణ జరిగిన వెంటనే కాలువ పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వం బునాదిగాని కాల్వ పనులకు రూ.267 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈనెల 3 నుండి 18 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతాయని రైతులు తమ భూసంభందిత సమస్యలను సదస్పుల్లో పరిష్కరించుకోవచ్చునని సామేల్ వివరించారు
ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కి ముందు మున్సిపాలిటీ 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి యాదయ్య, తహశీల్దార్ పి.జ్యోతి, ఎంపిడిఒ బాలాజీ, మున్సిపల్ కమీషనర్ సతీస కుమార్, హౌజింగ్ డిఇ శ్రీరాములు, కాంగ్రెస్ జిల్లా ఉపాద్యక్షుడు పైళ్ళ సోమిరెడ్డి, ఎపి ఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరి రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహ్మారెడ్డి, అవిలిమల్లు, పట్టణ అద్యక్షుడు గుండగోని రామచంద్రుగౌడ్, మార్కెట్ డైరెక్టర్లు ఎండి.సమీర్, పన్నాల శ్రీనివాస్రెడ్డి, నాయకులు రాచకొండ బాలరాజు గౌడ్, మెంట నాగేష్, మందుల సురేష్, కారుపోతుల వెంకన్న, నర్సింహ్మారెడ్డి, గుండు శ్రీను, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.