Saturday, June 7, 2025

విత్తనం నాటక ముందే ‘రైతు భరోసా’

- Advertisement -
- Advertisement -

విత్తనం నాటకం ముందే రైతు భరోసా అందిస్తామని, రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ‘తెలంగాణ రైతు మహోత్సవం’ను స్థానిక ఎంఎల్‌ఎ, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు రైతు మహోత్సవ కార్యక్రమానికి మంత్రు ఎడ్లబండిపై ఊరేగింపుగా చేరుకోగా జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్‌లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, వ్యవసాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ‘రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.. దేశానికి వెన్నెముక అయిన రైతును కాపాడుకోవాలి’ అని అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. రైతుల అభివృద్ధి, సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని అన్నారు.

రైతులతో రాజకీయం చేస్తే వారికే నష్టమని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ రాజకీయాలకు అతీతంగా రైతులకు సహకరించాలని, అప్పుడే రైతులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని వెల్లడించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పంటల మార్పిడి విధానం, సేంద్రియ ఎరువులు వాడడంలో రైతులకు అవగాహన కల్పించడం రైతు మహోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లా కలెక్టర్ స్థలం కేటాయిస్తే హుస్నాబాద్‌లో 90 టన్నుల నుండి 120 టన్నుల కెపాసిటీ ఆయిల్ పామ్ గోదాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రైతులను చైతన్యపరచడమే తెలంగాణ రైతు మహోత్సవ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూడు రోజుల నిర్వహించే కిసాన్ మేళా రైతులు విచ్చేసి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరికరాల వినియోగం తదితర అంశాలపై మెలకువలు తెలుసుకోవాలని.. శాస్త్రవేత్తలతో రైతులు ముఖాముఖి చర్చలు జరిపి సందేహాలను నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. సిఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతోందని, త్వరలోనే పూర్తి చేసి ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

రైతులు అత్యాధునిక టెక్నాలజీ వినియోగంను పెంచుకోవాలని ఎంఎల్‌ఎసి అంజిరెడ్డి హితవు పలికారు. రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి కొత్త టెక్నాలజీ.. మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని.. విత్తనాలు, గిట్టుబాటు ధరలు, యంత్రాలకు సబ్సిడీ అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ రాయల్ నాగేశ్వరరావు అన్నారు. రైతులు రాజు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. 3 రోజులపాటు నిర్వహించనున్న కిసాన్ మేళాలో జిల్లా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతలు, పరికరాల వినియోగంపై అవగాహన ఏర్పరచుకోవాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సూచించారు. రైతు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 150కి పైగా స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ గోపితోపాటు పార్టీ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ ఛైర్మన్ బంక చందు, చిత్తారి రవీందర్, ఎండి హసన్, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News