ఇథనాల్ కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని అరెస్టును సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న 12 గ్రామాల రైతులను, రిమాండ్లో వున్న బాధిత కుటుంబాలను పరామర్శించడానికి సోమవారం పెద్దదన్వాడ గ్రామానికి వెళ్లిన సిపిఎం రాష్ట్రకార్యదర్శి జాన్వెస్లీతో పాటు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్, గద్వాల జిల్లా కార్యదర్శి ఎ వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న కారును వెంబడిరచి, మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత వారం రోజులుగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరియమ్మ అనే దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టడమే కాకుండా, 46 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నిర్బంధాలు రాష్ట్ర ప్రభుత్వానికి తగదని, గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు చేసిన కాంగ్రెస్ పార్టీ, తాను అధికారంలోకి రాగానే నియంతృత్వంగా వ్యహరిస్తూ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకోవడం దుర్మార్గమని ఆపార్టి విమర్శించింది.
ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల పంట పొలాలు దెబ్బతింటాయని, తక్షణమే ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెనక్కు తీసుకోవాలని, జైల్లో పెట్టిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని, గ్రామాల్లో పోలీస్ పికెటింగ్లు ఎత్తివేసి, అక్రమ అరెస్టులను ఆపాలని, మరియమ్మ పై దాడిచేసిన పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిసిఎం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.